అయిదారేళ్ల క్రితం పతనం అంచుల్లోకి వెళ్తున్న భారత ఆర్థికవ్యవస్థను తమ ప్రభుత్వం కాపాడిందని ప్రధాని మోడీ అన్నారు. ఎకానమీని తమ ప్రభుత్వం స్థిరీకరించడమే కాక, దానికి క్రమశిక్షణ తెచ్చే ప్రయత్నాలు కూడా చేసిందని మోడీ అన్నారు. పరిశ్రమల యొక్క దశాబ్దాల నాటి పాత డిమాండ్లను నెరవేర్చడానికి కూడా తమ శ్రద్ధ చూపించిందని ప్రధాని అన్నారు.
శుక్రవారం(డిసెంబర్-20,2019)ఢిల్లీలో జరిగిన అసోచమ్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ…ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా.. ఆ సంక్షోభం నుంచి బలంగా గట్టెక్కుతామని అన్నారు. అయిదారేళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ కూప్పకూలిపోయిందని, కానీ తమ ప్రభుత్వం ఆ వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షించి, మళ్లీ గాడిలో పడేలా చేశామన్నారు. తమ ప్రభుత్వం రైతులు, కార్మికులు, కార్పొరేట్ సంస్థల ఆందోళనలను పట్టించుకుంటోందన్నారు.
పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నామని, పారదర్శకత, సామర్థ్యాన్ని, బాధ్యతను కూడా పెంచుతున్నామన్నారు. కంపెనీస్ యాక్టులో ఉన్న కొన్ని అంశాలను ఎత్తివేయాలనుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. వ్యాపారాన్ని మరింత సరళతరం చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మోసాల వల్ల అన్ని వ్యాపారాలు దెబ్బతినవని, విఫలమైనంత మాత్రాన దాన్ని నేరంగా చూడరాదు అని మోడీ అన్నారు. ఈ రోజు 13 బ్యాంకులు మళ్లీ లాభాలను ఆర్జించడం ప్రారంభమైందని,ఇది తమ ప్రభుత్వ ప్రయత్నాల ఫలితమని ప్రధాని అన్నారు. “ఆరు బ్యాంకులు ఇప్పుడు PCA నుండి బయటపడ్డాయన్నారు. బ్యాంక్ విలీనాల ప్రక్రియను కూడా వేగవంతం చేసామని మోడీ తెలిపారు. నేడు బ్యాంకులు తమ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి, తమకు తాముగా ప్రపంచవ్యాప్త ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాయని మోడీ అన్నారు.
భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రతిష్టాత్మక లక్ష్యం గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ…నేను 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు, దానికి వ్యతిరేకంగా ప్రతికూల ప్రచారం గురించి కూడా నేను అవగాహనతో ఉన్నాను. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం ఆకస్మికంగా లేదు. గత ఐదేళ్ళు ఇది చర్చనీయాంశమైంది. 2014 లో భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించాను. దేశం దీనిని సాధించడానికి ప్రయత్నాలు చేసింది. ఏదైనా కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజల సమీకరణ మరియు వ్యవస్థ ఆధునీకరణ ముఖ్యమైనవని మోడీ తెలిపారు.