Mallikarjun Kharge: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే కీలక నిర్ణయం.. రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా.. ఎందుకంటే?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే.. శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు.
- Harishth Thanniru
- Published On : October 1, 2022 / 02:50 PM IST
Mallikarjun Kharge
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే.. శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసి, అందుకు సంబంధించిన లేఖను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ తర్వాత 2021 ఫిబ్రవరిలో ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. అయితే, ప్రస్తుతం ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఇటీవల ఉదయ్పూర్ చింతన్ శిభిరంలో కాంగ్రెస్ ప్రకటించిన “ఒకే వ్యక్తి, ఒకే పదవి” అనే నియమానికి అనుగుణంగా తాను రాజ్యసభలోని ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తున్నానని సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారనే విషయం ఆసక్తికరంగా మారింది. అనూహ్య మలుపుల మధ్య కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లిఖార్జున్ ఖర్గే పోటీలోకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారంతో నామినేషన్ల గడువు పూర్తయింది. చివరి నిమిషంలో ఖర్గే పేరు తెరపైకి రావడంతో దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్, మల్లిఖార్జున్ ఖర్గే, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠిలు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
మల్లిఖార్జున్ ఖర్గేనే కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువ అని కాంగ్రెస్ లోని పలువురు నేతలు పేర్కొంటున్నారు. దీనికి కారణంగా.. గాంధీ కుటుంబంతో పాటు పార్టీలోని అధికశాతం మంది సీనియర్ నేతలు ఖర్గేకే మద్దతుగా ఉన్నారని పేర్కొంటున్నారు. ఎన్నిక జరగడమే తరువాయి.. మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నిక లాంఛనమే అవుతుందని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సోనియా సూచనల మేరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే రాజీనామా చేశారన్న వాదన వినిపిస్తుంది.
