Bank strike today: సోమవారం నుంచే బ్యాంకు ఉద్యోగుల సమ్మె
బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో బ్యాంకు సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది.
- Subhan Ali Shaik
- Published On : March 15, 2021 / 09:42 AM IST
Bank Strike
Bank strike today: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో బ్యాంకు సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది. పది లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఫోరం వెల్లడించింది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తున్నట్టు ప్రకటించింది
అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మార్చి 4, 9, 10 తేదీల్లో జరిగిన రాజీ చర్చలు సానుకూల ఫలితం ఇవ్వకపోవడంతో సమ్మె అనివార్యంగా మారినట్టు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ చేయడంపై ఉద్యోగులు, సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తూ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరించేందుకు నిర్ణయించిన కేంద్రం.. కొన్ని బ్యాంకులను ఇప్పటికే ఇతర బ్యాంకుల్లో కలిపేసిందని, భవిష్యత్లో అన్ని బ్యాంకులు ప్రైవేటీకరణ అయిపోతుందని.. ఇటువంటి నిర్ణయాలను కేంద్రం ఉప సంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగనున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దిగువ స్థాయి సిబ్బంది నుంచి బ్యాంక్ మేనేజర్ల వరకూ అందరూ ఈ సమ్మెలో అంతా పాల్గొంటున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతో పాటు బ్యాంకుల్లో సంస్కరణలు చేపట్టవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో భాగంగా జిల్లాలో రెండు రోజుల పాటు సేవలను నిలిపివేస్తున్నట్లు బ్యాంకు ఉద్యోగులు తెలిపారు.
