Step in right direction పాకిస్తాన్ ప్రధానమంత్రని ఇమ్రాన్ఖాన్కు భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాయడంపై పీడీపీ అధినేత్రి, జమ్మూకశ్మీరం మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ లేఖ సరైన దిశలో ఒక అడుగు అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ముఫ్తీ బుధవారం ఓ ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ..పాకిస్తాన్ ప్రధానిని చేరుకోవడానికి సరైన దిశలో ఒక అడుగు వేశారు. వాజ్పేయిజీ ప్రముఖంగా చెప్పినట్లు..ఒకరు తన స్నేహితులను మార్చగలరు. కానీ, పొరుగువారిని కాదు. ఇది ఇరు దేశాల మధ్య సంభాషణ, సయోధ్య ప్రక్రియకు దారితీస్తుందని నమ్ముతున్నాను. కశ్మీర్ కు వైద్యం అవసరం అని మెహబూబా ముఫ్తీ తన ట్వీట్లో పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మోడీ రాసిన లేఖ ప్రతి ఫొటోను ఆమె ట్విట్టర్ లో షేర్ చేశారు.
కాగా, మంగళవారం(మార్చి-23,2021) పాకిస్తాన్ డే సందర్భంగా..పాక్ ప్రధానికి, పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని మోడీ లేఖ రాశారు. పొరుగు దేశంగా.. పాకిస్తాన్ ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను భారత్ కోరుకుంటుంది. ఇందుకోసం భీభత్సం, శత్రుత్వం లేని విశ్వసనీయ వాతావరణం అత్యవసరం అని ప్రధాని మోడీ తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, భారత్-పాక్ మధ్య మారిన సంబంధాలకు గుర్తుగా.. రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు మోడీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.