×
Ad

Supreme Court : మోసపూరిత ప్రకటనలు ఆపండి, లేదంటే భారీ జరిమానా తప్పదు : పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు వార్నింగ్

మోసపూరిత ప్రకటనలు ఆపాలని లేదంటే భారీ జరిమానా తప్పదు అంటూ పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది.

  • Published On : November 22, 2023 / 10:43 AM IST

supreme court patanjali

supreme court patanjali Baba ramdev : మోసపూరిత ప్రకటనలు ఆపాలని లేదంటే భారీ జరిమానా తప్పదు అంటూ పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మంగళవారం (నవంబర్ 21,2023)న జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద కంపెనీ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

ప్రముఖ యోగా గురువురు బాబా రాందేవ్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న పతంజలి ఆయుర్వేద కంపెనీ…తమ ఉత్పత్తులు పలు వ్యాధులను నయం చేస్తాయని ప్రకటించుకోవడంపై కూడా సుప్రీంకోర్టు మండిపడింది. పతంజలి సంస్థ చేస్తున్న నిరాధారమైన, మోసపూరితమైన ప్రకటనలను ఆపివేయాలని లేకుంటే.. ఆ కంపెనీ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై రూ.కోటి చొప్పున జరిమానా విధించే విషయాన్ని పరిశీలించాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది.

కాగా..యావత్ ప్రపంచాన్ని కల్లోలానికి గురి చేసిన కోవిడ్ మహమ్మారి వైరస్ నివారణకు వినియోగిస్తున్న ఆధునిక ఔషధాలు (Modern medicine), టీకాలకు వ్యతిరేకంగా రాందేవ్ బాబా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఐఎంఏ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పిటీషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. మొదటి రోజే మొట్టికాయలు

పతంజలి ఆయుర్వేద కంపెనీ అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.ఆధునిక వైద్యం, డాక్టర్లపై కించపరిచేలా వ్యవహరించటంపై సరికాదని సూచించింది.  ఇటువంటి ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని.. ఇలాంటి ప్రకటనలు చేయవద్దని పతంజలి కంపెనీకి ఆదేశించింది.అనంతరం విచారణను 2024 ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.

కాగా..ఇదే కేసులో గతంలో కూడా సుప్రీంకోర్టు రాందేవ్ బాబాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచే ప్రకటనలు చేయవద్దని రాందేవ్ బాబాను హెచ్చరించింది.