Suvendu Adhikari: సన్యాసి చిన్మోయ్ కన్నీటి దృశ్యం.. 5 గంటల పెరోల్పై బంగ్లాదేశ్ దాష్టీకం.. సువేందు సంచలన కామెంట్స్
బంగ్లాదేశ్లో చిన్మోయ్ కృష్ణదాస్ సంఘటనపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి(Suvendu Adhikari) స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- V Santhosh Kumar
- Published on- September 12, 2026 / 08:33 PM IST
Suvendu Adhikari sensational comments on Chinmoy Krishna Das custody in Bangladesh.
- బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి కస్టడీ
- 5 గంటల పెరోల్పై హాజరు
- సువేందు అధికారి తీవ్ర ఆగ్రహం
Suvendu Adhikari: బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు, అక్కడ కస్టడీలో ఉన్న హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలే తన తల్లి అంత్యక్రియల కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం కేవలం 5 గంటల పెరోల్ ఇవ్వడంతో హాజరైన చిన్మోయ్ కృష్ణదాస్, అక్కడ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి విపరీతమైన ఆవేదనను నింపింది. ఈ విషాదకర సంఘటనపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి (Suvendu Adhikari)స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్మోయ్ కన్నీళ్లు సనాతనులను కదిలించాయి:
తల్లి చివరి చూపు సమయంలో చిన్మోయ్ కార్చిన కన్నీళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతనవాదుల హృదయాలను కదిలించాయని సువేందు అధికారి పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ దృశ్యమే నిదర్శనమని అన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, స్వామి ప్రణవానంద వంటి మహానీయుల పోరాటం వల్లే బెంగాల్లో కొంత భాగం భారత్లో విలీనమైందని, లేకపోతే ఈ రోజు మన పరిస్థితి కూడా చిన్మోయ్ కృష్ణదాస్ లాగే బంగ్లాదేశ్ కస్టడీలోనే మిగిలిపోయేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ విభజన నాటి ఆవేదన.. టీఎంసీపై తీవ్ర విమర్శలు:
దేశ విభజన సమయంలో తమ కుటుంబం అనుభవించిన ఆవేదనను సువేందు గుర్తు చేసుకున్నారు. తన తల్లి, తాతలు హిందువులు కావడం వల్లే బంగ్లాదేశ్ నుండి కట్టుబట్టలతో భారత్కు పారిపోయి రావలసి వచ్చిందని తెలిపారు. బెంగాలీ హిందువుల కోసం పోరాడిన నేతల త్యాగాలను వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా మరుగున పరిచాయని ఆరోపించారు. దుర్గాపూజ, మహాలయ వంటి సంప్రదాయాలకు ద్రోహం చేస్తూ, టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ను “జమాతీకరించేందుకు” ప్రయత్నిస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.
