UP Assembly Elections: ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైన మూడో దశ పోలింగ్
మూడో దశలో భాగంగా మొత్తం 16 జిల్లాలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
- Bharath Reddy
- Published On : February 20, 2022 / 07:48 AM IST
Elections
UP Assembly Elections: ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు దశల పోలింగ్ పూర్తికాగా, మూడో దశ పోలింగ్ ఆదివారం ఉదయం ఏడూ గంటలకు ప్రారంభమైంది. మూడో దశలో భాగంగా మొత్తం 16 జిల్లాలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 59 అసెంబ్లీ స్థానాలకు గానూ వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో విడత ఎన్నికల్లో 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆదివారం ఉదయం ఏడూ గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొదటి రెండు దశల్లోనూ స్వల్ప ఘటనలు మినహా ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు..మూడో దశను ప్రశాంతంగా ముగించేందుకు కృషి చేస్తున్నారు.
Also Read: Punjab Polls: నేడే పంజాబ్ ఎన్నికలు.. ఉదయం 7 గంటలకే ప్రారంభం
మూడో విడత ఎన్నికల్లో ముఖ్య నేతలు బరిలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఇదే స్థానంలో బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్ పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ పోలింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కీలకమైన జశ్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి అఖిలేష్ బాబాయ్ శివపాల్ సింగ్ పోటీలో ఉన్నారు. యూపీ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా భావించే పలు అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు, కోవిడ్ ప్రోటోకాల్ నడుమ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
Also read: Kumar Vishwas: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ కు “వై: కేటగిరి భద్రత
