Corona Third Wave కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు,ఎలా వస్తుందో చెప్పలేం..సిద్దంగా ఉండండి
ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో దేశం అతలాకుతలమవుతోంది.
- venkaiahnaidu
- Published On : May 5, 2021 / 06:05 PM IST
Third Wave Inevitable Grim Warning From Governments Scientific Adviser
third wave ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో దేశం అతలాకుతలమవుతోంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని,థర్డ్ వేవ్ ఎప్పుడు,ఎలా వస్తుందో చెప్పలేమని కేంద్రప్రభుత్వపు ప్రధాన సాంకేతిక సలహాదారు డాక్టర్ కే విజయ్ రాఘవన్ హెచ్చరించారు. థర్డ్ వేవ్ నాటికి వైరస్ మరింతగా మారవచ్చన్నారు. కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు మనమంతా సిద్దంగా ఉండాలన్నారు.
బుధవారం విజయ్ రాఘవన్ మీడియాతో మాట్లాడుతూ…ఒరిజినల్ స్ట్రెయిన్ లాగే వేరియంట్లు వ్యాప్తి చెందుతాయి. వీటికి కొత్త రకాల ప్రసార లక్షణాలు ఉండవు. మరింత ప్రసారం చేయగల పద్దతిలో ఇది మానవులకు సోకుతుంది. ప్రపంచంతో పాటు భారత్ లో కూడా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి.రోగ నిరోధక వ్యవస్థను బోల్తా కొట్టించేవి, వ్యాధి తీవ్రతను పెంచే లేదా తగ్గించే వేరియంట్లు రాబోతున్నాయి. ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్ లు బాగానే ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. కొత్త స్ట్రెయిన్ ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్ ను తయారుచేసుకోవాలి. వ్యాక్సినేషన్ పెరిగితే కొత్త వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చన్నారు.
ఇక,రోజువారీ కొత్త కోవిడ్ కేసులలో దాదాపు 2.4శాతం పెరుగుదల ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ తెలిపారు. రోజువారీ కోవిడ్ మరణాలు కూడా పెరిగాయన్నారు. మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,ఢిల్లీ,హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ కోవిడ్ మరణాలు నమోదవుతున్నాయన్నారు. ఇక,కొన్ని ప్రాంతాల్లో కేసులు ఆందోళనకరంగా ఉన్నాయని..గత వారం రోజుల్లోబెంగళూరులో 1.49లక్షల కేసులు,చెన్నైలో 38వేల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇక,కొన్ని జాల్లాల్లో(ఎర్నాకులం,కోజికోడ్,గురుగ్రామ్) వేగంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మే-1 నుంచి వ్యాక్సినేషన్ పాలసీని కేంద్రం సవరించిందని..ఇందులో భాగంగా 9రాష్ట్రాల్లో 6.71లక్షల మంది 18-44ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయన్నారు. ఏడు రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు. మహరాష్ట్ర,కేరళ,కర్ణాటక,ఉత్తరప్రదేశ్,ఆంధ్రప్రదేశ్ లో 1.5లక్షల యాక్టివ్ కేసులుంటం ఆందోళన కలిగిస్తోందని లావ్ అగర్వాల్ చెప్పారు. ఇక,మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ఆయన చెప్పారు.
