West Bengal school job scam: మేం ఎలాంటి జోక్యం చేసుకోం.. మంత్రి ఛటర్జీ అరెస్టుపై టీఎంసీ కీలక ప్రకటన..
పశ్చిమ బెంగాల్ లో ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. నిర్ణీత కాలం వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని వారు ఈడీని కోరారు.
- Harishth Thanniru
- Published On : July 24, 2022 / 07:15 PM IST
Partha Chatterjee
West Bengal school job scam: పశ్చిమ బెంగాల్ లో ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన వారు ఎంత పెద్ద నేత అయిన తమ పార్టీ రాజకీయంగా జోక్యం చేసుకోబోదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈడీని ఓ విషయంపై వారు డిమాండ్ చేశారు. నిర్ణీత కాలం వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని సూచించారు.
ఈడీ దాడుల్లో సినీ నటి, మోడల్ అర్పితా ముఖర్జీ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు బయటపడిన విషయం విధితమే. ఈ విషయంపై కునాల్ ఘోష్ స్పందిస్తూ.. ఆమెతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని కేసులను ఏళ్ల తరబడి విచారిస్తున్నాయన్న ఆయన. ఈ కేసును మాత్రం వేగంగా పూర్తి చేయాలని కోరారు.
Teacher recruitment scam: బెంగాల్ మంత్రిని అరెస్టు చేసిన ఈడీ
ఈనెల 22న బెంగాల్ లోని పలు చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ప్రధానంగా టీఎంసీ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, అధికారుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో మంత్రి పార్థా ఛటర్జీ స్నేహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో సుమారు 21కోట్లకుపైగా నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే పార్థా ఛటర్జీ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కావడం గమనార్హం. ఈ విషయంపై రెండు రోజులుగా నోరువిప్పని టీఎంసీ నేతలు తాజాగా ఈ కేసు విషయంలో పార్టీ తరపున మేము ఎలాంటి జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.
