Lakhimpur Kheri దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మరో ముగ్గురికి యోగి సర్కార్ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హోంశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, లఖిమ్పూర్ లో రాహుల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పిన కొద్ది సేపటికే యూపీ సర్కార్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఇవాళ మధ్యాహ్నాం విమానంలో ఢిల్లీ నుంచి లక్నో ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న రాహుల్ గాంధీ..రోడ్డు మార్గాన లఖిమ్పూర్ బయల్దేరారు. పోలీస్ ఎస్కార్ట్ ను తిరస్కరించిన రాహుల్..సొంత కాన్వాయ్ లోనే లఖిమ్పూర్ కి బయల్దేరారు. రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ సీఎం చన్నీ,చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగల్, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
మరోవైపు, సోమవారం నుంచి యూపీలోని సీతా పూర్ గృహ నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీని పోలీసులు విడుదల చేశారు. సోమవారం లఖిమ్పూర్ వెళ్లేందుకు ప్రియాంకగాంధీ ప్రయత్నించగా..పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక,మంగళవారం లఖిమ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఛత్తీస్గఢ్ సీఎం బూపేష్ భాఘేల్ను కూడా లక్నో ఎయిర్పోర్టులో అడ్డుకున్న విషయం తెలిసిందే.
కాగా, ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఆదివారం యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా-బన్బీర్పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో మంత్రుల కాన్వాయ్ లోని రెండు కార్లు రైతులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా..ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. అయితే రైతులపైకి దూసుకెళ్లిన ఓ కారులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తుండగా..అసలు ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆశిష్ మిశ్రా చెబుతున్నారు.
ALSO READ రైతులపై దూసుకెళ్లిన కారు వీడియో వైరల్..సీబీఐ దర్యాప్తు చేయించాలని సీజేఐకి లాయర్ల విజ్ణప్తి
ALSO READ తాను అక్కడ లేనన్న కేంద్రమంత్రి కుమారుడు..నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి