Tunnel Accident Rescue Update: రెస్క్యూ ఆపరేషన్ పనులకు పదేపదే అడ్డంకులు.. కార్మికుల కోసం కుటుంబ సభ్యుల ఎదురు చూపులు
చార్ థామ్ యాత్ర మార్గంలో నిర్మిస్తున్న ఈ సొరంగంలో కొంత భాగం దీపావళి రోజున కూలిపోయిన విషయం తెలిసిందే. దీనికారణంగా అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు శిథిలాల అవలివైపు చిక్కుకుపోయారు.
- Harishth Thanniru
- Published On : November 25, 2023 / 11:07 AM IST
Uttarkashi Silkyara Tunnel
Tunnel Accident: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 14వ రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. డ్రిల్లింగ్ కోసం యూఎస్ కు చెందిన అగర్ డ్రిల్లింగ్ మిషన్ ను ఉపయోగించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో మాన్యువల్ డ్రిల్లింగ్ చేసి కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కార్మికులను త్వరగా బయటకు తీసుకువచ్చేందుకు మైక్రో టన్నల్ లో మాన్యువల్ డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. మాన్యువల్ డ్రిల్లింగ్ కావడంతో కార్మికులు ఎప్పుడు బయటకు వస్తారో ఖచ్చితమైన సమయం చెప్పలేమని అధికారులు తెలిపారు.
Also Read : Vizag Harbour Case : విశాఖ మత్స్యకారుల కొంపముంచిన ఉప్పుచేప.. బోట్ల అగ్ని ప్రమాదం ఘటనలో కీలక మలుపు!
పైప్ లైన్ నుండి అమెరికా నుంచి తెచ్చిన హెవీడ్యూటీ అగర్ డ్రిల్లింగ్ మెషిన్ ను తీసివేసిన తరువాత మాన్యువల్ డ్రిల్లింగ్ ను డ్రిల్లర్లు ప్రారంభించనున్నారు. అగర్ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మైక్రో టన్నెల్ ఏర్పాటుకు 46.8 మీటర్ల మేర పైపులను లోనికి పంపించారు. మరో ఆరు నుంచి తొమ్మిది మీటర్ల మేరలోనికి వెళ్తే కార్మికులను చేరుకునే అవకాశం ఉంది. రెస్క్యూ టన్నెల్ ను పరిశీలించడానికి ఢిల్లీలోని పర్సన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ బృందం గ్రౌండ్ – పనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సాంకేతికతను ఉపయోగిస్తుంది. గ్రౌండ్ – పెనేట్రేటింగ్ రాడార్ భూమి లోపల పరిస్థితులు అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. టన్నెల్ లో చిక్కుకున్న వారికి వాటర్ బాటిల్స్ లో ఆహారం (కిచిడి) నింపి సహాయక సిబ్బంది పంపిస్తున్నారు. కార్మికుల కోసం టన్నెల్ వద్ద కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
Also Read : No non veg day : మాంస రహిత దినోత్సవం నేడు…ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎందుకంటే…
రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమైన ఏజెన్సీల సిబ్బంది డ్రిల్లింగ్ కు ఉపయోగించేందుకు సుత్తి, గ్యాస్ కట్టర్ మిషన్ వంటి సాధారణ సాధనాలతో పనుల్లో నిమగ్నమవుతున్నారు. పైపు మార్గంలో వచ్చే అడ్డంకిని చేతితో సాధనాలు ఉపయోగించి తొలగిస్తారు. ఇది చాలా కష్టమైన పని. ఈ విధానం ద్వారా టన్నెల్ లో చిక్కుకున్న వారిని చేరుకోవాలంటే సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ విధానం ద్వారా కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
చార్ థామ్ యాత్ర మార్గంలో నిర్మిస్తున్న ఈ సొరంగంలో కొంత భాగం దీపావళి రోజున కూలిపోయిన విషయం తెలిసిందే. దీనికారణంగా అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు శిథిలాల అవలివైపు చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వీరిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కార్మికులకు బయటకు తీసుకొచ్చేందుకు నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ వివరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సీఎం కు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు.
