Rains
North India Rains : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వానలు వణుకు పుట్టిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్ తో పాటు పంజాబ్ లోని మొహాలీ, హోషియాపూర్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటివరకు వరదలకు సుమారు 12మంది చనిపోయారు.
ఢిల్లీలో దాదాపు 40ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. ప్రజలు కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఢిల్లీలో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. హస్తినలో కుంభవృష్టి వానలు పడుతున్నాయి. ఒక్కరోజులో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 నుంచి చూస్తే ఢిల్లీలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే. ప్రగతి మైదాన్, నెహ్రూ నగర్, పంచశీల మార్గ్ తదితర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.
ఢిల్లీ ఎన్సీఆర్ లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ వానలు బీభత్సం సృష్టించాయి. నదుల్లో ఉధృతి పెరిగి అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచాయి.
Also Read..Delhi Rain : ఢిల్లీలో కుండపోత వర్షాలు.. 40 ఏళ్ల తరువాత ఒక్క రోజులో భారీ వర్షం
రెండు రోజులుగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండ ప్రాంతం కావడంతో వర్షాలకు వరదలు పోటెత్తాయి. బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.