ఆ రోజు ఇజ్రాయెల్ ప్రతిపాదన భారత్ ఒప్పుకొని ఉంటే ఈ రోజు పాక్ వద్ద అణ్వస్త్రాలే ఉండేవి కావు… ఇందిరాగాంధీ హయాంలో ఏం జరిగిందంటే..

చివరకు పాకిస్థాన్ అణ్వస్త్ర దేశంగా మారింది.

ఇరాన్‌ అణ్వస్త్రాలను తయారుచేసుకుంటోందని, వాటిని తమపై ప్రయోగించే ముప్పు ఉందని ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. ఇలాంటి చర్యలే పాకిస్థాన్‌పై అప్పట్లో భారత్‌ తీసుకుంటే ఇప్పుడు దాయాది దేశం ఇంతగా విర్రవీగకపోయేది. ఇప్పుడు పాకిస్థాన్‌ పదే పదే తమ వద్ద అణు బాంబులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తోంది.

అలాగే, ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణుబాంబును వేస్తే.. ఇజ్రాయెల్‌ను పాకిస్థాన్ వదిలిపెట్టదని ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహిసిన్ రెజాయి అన్నారు. ఈ మేరకు పాక్ తమకు హామీ ఇచ్చిందన్న చెప్పారు. అయితే, ఈ కామెంట్లను పాకిస్థాన్‌ కొట్టిపారేసింది.

పాకిస్థాన్‌ 1970-80లో అణ్వస్త్రాలను తయారు చేయడం ప్రారంభించిన సమయంలోనే ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. అప్పట్లో భారత్‌కు ఇజ్రాయెల్ ఒక కీలక ప్రతిపాదన చేసింది. పాక్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కహూటా అణు స్థావరాన్ని బాంబులతో ధ్వంసం చేసే ప్రణాళికను భారత్‌కు సూచించింది.

Also Read: తారస్థాయికి యుద్ధం.. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ను హతమార్చాల్సిందేనంటూ నెతన్యాహు కామెంట్స్‌.. “జీ7” నుంచి బయలుదేరనున్న ట్రంప్

పశ్చిమ ఆసియాలో “ఇస్లామిక్ బాంబు” ప్రభావాలపై ఇజ్రాయెల్‌కు ఉన్న ఆందోళన వల్ల ఈ ప్రణాళికను భారత్‌ ముందుకు తీసుకువచ్చింది. 1981లో ఇరాక్‌లోని ఒసిరాక్ రియాక్టర్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది.

ఈ దాడి చేయకముందే అచ్చం ఇటువంటి దాడికి సంబంధించిన ప్రణాళికనే పాకిస్థాన్‌పై అమలు చేద్దామని భారత్‌కు ఇజ్రాయెల్‌ సూచించింది. 1978లో ఇజ్రాయెల్‌ ఈ ప్రణాళికను అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ను చెప్పింది.

అయితే, అందుకు ఆయన ఒప్పుకోలేదు. 1980లో ఇందిరా గాంధీ ప్రధాని మంత్రి అయ్యాక ఇజ్రాయెల్‌ ఆమెను సంప్రదించింది. ఇందిరా గాంధీ అందుకు ఒప్పుకున్నారు. దీంతో ఇజ్రాయెల్‌ నుంచి ఎఫ్‌-16, ఎఫ్‌-15 యుద్ధ విమానాలు జామ్‌నగర్‌, ఉదంపుర్‌కు వచ్చాయి.

పాకిస్థాన్‌పై దాడులు చేసేందుకు ఇక భారత్‌ తమకు సహకరిస్తుందని ఇజ్రాయెల్ భావించింది. చివరి నిమిషంలో ఇందిరా గాంధీ దాడులకు సహకరించలేదు. తమపై భారత్‌, ఇజ్రాయెల్‌ దాడులు చేయడానికి సిద్ధమయ్యాయని పాక్‌కు సమాచారం అందండంతో అమెరికాకు పాక్‌ ఈ విషయాన్ని తెలిపింది.

అంతా అమెరికా వల్లే..
ఆ తర్వాత భారత్‌పై అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఇండియా దాడులు చేయడాన్ని మానుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు అమెరికా సాయం చేయడం వెనుక అగ్రరాజ్య స్వార్థ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఆఫ్ఘానిస్థాన్‌లో పోరాటం చేయడానికి ముజాహిదీన్‌లకు పాకిస్థాన్‌ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడింది. అందుకే పాక్‌కు అమెరికా సపోర్టు లభించింది. మరోవైపు, అదే సమయంలో భారత్‌లో ఖలిస్థాన్‌ ఉద్యమం, ఇతర పలు అంతర్గత సమస్యలు ఉన్నాయి. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించిన అంశం నుంచి భారత ప్రజలు అప్పటికి ఇంకా తేరుకోలేదు.

అటువంటి సమయంలో పాకిస్థాన్‌పై దాడి చేస్తే పూర్తిస్థాయి యుద్ధం జరిగే ముప్పు ఉంది. దీంతో ఇజ్రాయెల్‌తో కలిసి పాక్‌పై దాడి ప్రణాళికను అమలు చేయడంలో విరమించుకున్నారు. చివరకు పాకిస్థాన్ అణ్వస్త్ర దేశంగా మారింది. 1998లో భారత్ అణుపరీక్ష జరిపిన తర్వాత పాకిస్థాన్‌ కూడా అదే పని చేసింది.