Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో పాదయాత్ర’ చేపట్టారు. ఈ యాత్ర మూడో రోజు తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ లో శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇది ప్రజల కష్టాలు తెలుసుకునే అద్భుత అవకాశమన్నారు. ఈ యాత్రలో కేవలం నేను ఓ కాంగ్రెస్ నాయకుడిగానే పాల్గొంటున్నానని, తాను ఈ యాత్రకు నాయకత్వం వహించడం లేదని రాహుల్ చెప్పారు.
మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారా అని మీడియా ప్రశ్నలకు రాహుల్ స్పష్టత ఇచ్చారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు.. నేను అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది స్పష్టమవుతుందని తెలిపారు. నేను ఏం చేయాలో చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నానని, తన మనస్సులో ఎలాంటి గందరగోళం లేదని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజలతో మమేకం కావడానికే భారత్ జోడో పాదయాత్ర అని అన్నారు. బీజేపీ సిద్ధాంతాల వల్ల దేశానికి జరిగిన నష్టం, ద్వేషానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టడం జరిగిందని రాహుల్ అన్నారు.
బీజేపీ తన ఆదీనంలోకి దేశంలోని అన్ని సంస్థలను తీసుకుందని, వాటి ద్వారా ప్రతిపక్షాలపై ఒత్తిడి తెస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాదయాత్రలో భాగంగా ప్రజలు వారి సమస్యలను వివరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలు రోజురోజుకు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర ద్వారా రాబోయే రోజుల్లో నేను ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన కలిగి ఉంటానని రాహుల్ అన్నారు.