Abdul Bari Siddiqui: ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, విదేశాల్లోనే సెటిలవ్వమని నా పిల్లలకు చెప్పాను.. ఆర్జేడీ నేత సిద్ధిఖీ
సిద్ధిఖీ తన మాటల్లో ఎక్కడా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ అనే పదం ఇమిడి ఉందని వేరే చెప్పనక్కర్లేదు. ఇకపోతే, సిద్ధిఖీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు భారత దేశానికి వ్యతిరేకమైనవని మండిపడ్డారు
- tony bekkal
- Published On : December 23, 2022 / 06:05 PM IST
Asked my children to settle abroad as atmosphere is not good in country, says RJD leader Abdul Bari Siddiqui
Abdul Bari Siddiqui: ‘‘దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దేశం విడిచి వెళ్లిపోదామా అని కిరణ్ (ఆమీర్ భార్య) నన్ను అడిగింది’’ అని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ అప్పట్లో చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. అనంతరం ఇలాంటి వ్యాఖ్యలు మరుగున పడ్డాయి. పూర్తిగా ఇవి ఆగిపోయాయని చెప్పలేం. కానీ, కాస్త ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం లేదు. మళ్లీ ఇన్నాళ్లకు రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి చెందిన ఒక నేత అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
Jagdeep Dhankhar: సోనియా వ్యాఖ్యలపై స్పందించడం నా బాధ్యత.. వివరణ ఇచ్చిన ఉపరాష్ట్రపతి ధన్కడ్
దేశంలో ముస్లింలపై వ్యతిరేకత ఉందని, ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేరని, విదేశాల్లోనే ఉద్యోగాలు చూసుకుని, పౌరసత్వం పొంది, అక్కడే స్థిరపడిపోవాలని తన పిల్లలకు సలహా ఇచ్చినట్లు రాష్ట్రీయ జనతా దళ్ నేత అబ్దుల్ బరి సిద్ధిఖీ అన్నారు. గత వారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ నేతలు స్పందిస్తూ, ఈ దేశంలో అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, ఆయనకు లభిస్తున్న అన్ని రకాల సదుపాయాలను వదిలిపెట్టి పాకిస్తాన్ వెళ్లిపోవాలని సలహా ఇస్తున్నారు.
‘‘దేశంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించడానికి నా వ్యక్తిగత ఉదాహరణ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. కూతురు లండన్ ల్ ఆఫ్ ఎకనమిక్స్లో డిగ్రీ చేసింది. నేను వారికి ఇచ్చిన సలహా ఒక్కటే. విదేశాల్లోనే చదువు పూర్తి చేసుకుని, అక్కడే ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పాను. సాధ్యమైతే అక్కడే పౌరసత్వం తీసుకోని, అక్కడే సెటిలవ్వమని సూచించాను. కానీ, వారు నా మాటలు నమ్మలేదు. నేనింకా ఇక్కడే (భారత దేశంలో) ఉన్నానని వారు నాకు గుర్తు చేశారు. అయితే ఇక్కడి పరిస్థితులను తట్టుకోవడం చాలా కష్టమని వారితో చెప్పాను’’ అని సిద్ధిఖీ అన్నారు.
సిద్ధిఖీ తన మాటల్లో ఎక్కడా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ అనే పదం ఇమిడి ఉందని వేరే చెప్పనక్కర్లేదు. ఇకపోతే, సిద్ధిఖీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు భారత దేశానికి వ్యతిరేకమైనవని మండిపడ్డారు. అంత ఇబ్బందిపడుతున్నాననే భావన ఆయనకు ఉంటే, రాజకీయ నేతగా ఆయన పొందుతున్న రకరకాల లబ్ధులను వదిలిపెట్టి, పాకిస్తాన్కు వెళ్లిపోవాలని సలహా ఇచ్చారు. ప్రస్తుతం సిద్ధిఖీ.. ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా పని చేశారు.
