Nitin Gadkari: బ్యానర్లు వేయను, చాయ్ కూడా ఇవ్వను.. వచ్చే ఎన్నికల ప్రచారంపై కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన నిర్ణయం
జూలై నెలలో నాగపూర్లో జరిగిన ఉపాధ్యాయుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలుస్తారని తరుచూ అంటుంటారు. నిజానికి నేను ఇలాంటి వాటిని నమ్మను. కానీ ఒక ఎన్నికలో ఇలాంటి ప్రయోగం చేశాను. ప్రజలను నేను మటన్ పంపిణీ చేశాను.
- tony bekkal
- Published On : September 30, 2023 / 02:46 PM IST
2024 Elections: ఎన్నికలు అంటే ప్రచారం. ప్రచారం అంటే ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు, రోడ్డంతా జెండాలు, బయటనేమో ఎడతెగని ప్రసంగాలు, లోపలేమో ఊహకందని పంపకాలు. లిక్కర్, డబ్బు, బహుమతులు, ప్రమాణాలు, కుదరకపోతే బెదిరింపులు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు జరిగినా, ఏ పార్టీ అయినా అత్యంత సహజంగా కనిపించే వాతావరణం ఇది. అయితే ఇవేవీ చేయబోనని ఛాలెంజ్ చేస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వచ్చే ఎన్నికల్లో ఎక్కడా బ్యానర్లు వేయనని, ఎవరి దగ్గరి నుంచి లంచం తీసుకోనని-ఎవరికీ ఇవ్వనని, అలాగే ప్రచారంలో ప్రజలకు కనీసం చాయ్ (టీ) కూడా తాగిపించనని ఆ శపథం చేశారు.
New TCS Rules: అక్టోబర్ 1న జరగబోయే ఈ మార్పు గురించి తెలుసా? ఆ సర్టిఫికెట్ లేకపోతే ఇక కాలు కదపలేరు
తాజాగా మహారాష్ట్రలో మూడు జాతీయ రహదారుల ఆవిష్కరణ సందర్భంగా వాషింలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ లోక్సభ ఎన్నికల్లో నేను కీలక నిర్ణయం తీసుకున్నాను. ఎక్కడా పోస్టర్లు, బ్యానర్లు వేయను. అలాగే ప్రజలెవరికీ చాయ్ కూడా పంపిణీ చేయను. ఒకవేళ వాళ్లకు ఓటు వేయాలనిపిస్తే వేస్తారు, లేదంటే వేయరు. నేను ఎవరి దగ్గరి నుంచి లంచం తీసుకోను, ఎవరినీ ఎవరి దగ్గరి నుంచి తీసుకోనివ్వను. కానీ ఒక వాగ్దానం మాత్రం చేస్తాను. నేను ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పని చేస్తాను’’ అని గడ్కరీ అన్నారు.
ఇక ఇలాంటి వ్యాఖ్యలే జూలైలో ఒకసారి చేశారు గడ్కరీ. తాను ఒక ఎన్నికల్లో మటన్ పంపిణీ చేశానని, అయితే ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయానని చెప్పారు. వాస్తవానికి ప్రజలు చాలా తెలివైన వారని, వారి కోసం ఆలోచించేవారికే ఓటేస్తారని గడ్కరీ అన్నారు. జూలై నెలలో నాగపూర్లో జరిగిన ఉపాధ్యాయుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో డబ్బులు పంచి గెలుస్తారని తరుచూ అంటుంటారు. నిజానికి నేను ఇలాంటి వాటిని నమ్మను. కానీ ఒక ఎన్నికలో ఇలాంటి ప్రయోగం చేశాను. ప్రజలను నేను మటన్ పంపిణీ చేశాను. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయాను. ప్రజలను చాలా తెలివైన వారు. డబ్బులు అందరి దగ్గర తీసుకుంటారు. కానీ వారి కోసం ఆలోచించే వారికే ఓటేస్తారు’’ అని అన్నారు.
