Asaduddin Owaisi
Asaduddin Owaisi: బిహార్ రాష్ట్రంలో రామనవమి సందర్భంగా జరిగిన చోటు చేసుకున్న అల్లర్లపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఇఫ్తార్ విందులో్ పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ అల్లర్లను అదుపు చేయకుండా విందులు చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫమైందని ఆయన విమర్శించారు.
ఈ విషయమై ఆయన సోమవారం మాట్లాడుతూ ‘‘అల్లర్లను నిలువరించడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అల్లర్ల అనంతరం సైతం బాధితులను పరామర్శించి, వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. దీనికి బదులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకు వెళ్లి కర్జూర తింటున్నారు’’ అని అన్నారు. వాస్తవానికి ఇది ముందస్తు ప్రణాళికలతో జరిగిందని, మరలాంటప్పుడు ప్రభుత్వం నిద్రపోయిందా అని ఓవైసీ ప్రశ్నించారు. మార్చి 31న జరిగినప్పుడైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, మళ్లీ ఏప్రిల్ 1న కూడా జరగడం హేయమని ఓవైసీ అన్నారు.