జంటనగరాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాంధీ ఆసుపత్రి ఒకటి. ఎక్కడి నుంచో ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. ఎన్నో కష్టమైన కేసులను ఇక్కడి వైద్యులు పరిష్కరించారు. నిత్యం ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ సీన్ మరోలా ఉంది. ఎవరినీ చూసినా మాస్క్ లు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకంటే…కరోనా ఫీవర్ నెలకొంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ రాకాసి…తెలంగాణ గడ్డపై అడుగు పెట్టింది. ఈ వైరస్ బారిన 45 మంది చిక్కుకున్నారు. వీరందరికీ…గాంధీ ఆసుపత్రి దిక్కైంది. రెండో స్టేజ్ కు చేరుకోవడంతో..రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆసుపత్రి పూర్తిగా కరోనా చికిత్సలకే కేటాయించాలని 2020, మార్చి 26వ తేదీ గురువారం నిర్ణయించింది.
వైరస్ మూడో దశకు చేరుకుంటే తీవ్ర ప్రమాదమని గుర్తించింది. వెంటనే ఉన్నతాధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ చర్చించారు. కరోనా వ్యాప్తి కట్టడిపై గురువారం బీఆర్ కే భవన్ లో జరిగిన ఈ సమీక్షలో పై నిర్ణయాలు తీసుకున్నారు.
* సాధారణ ఓపీతో పాటు..అత్యవసరమైన వారు ఉస్మానియాకు వెళ్లాల్సి ఉంటుంది.
* అందుబాటులోకి మొత్తం 1500 పడకలు. ఇందులో 200 ఐసీయూ పడకలున్నాయి.
జనరల్ మెడిసన్, పీడియాట్రిక్స్, నెఫ్రాలజీ, పల్మనాలజీ, కార్డియాలజీ విభాగాలను ఇక్కడే కంటిన్యూ చేస్తారు.
* న్యూరాలజీ, అఫ్తల్మాజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, జనరల్ సర్జరీ విభాగాలను ఉస్మానియాకు తరలింపు.
ఇప్పటికే కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి కరోనా చికిత్స కేంద్రంగా అభివృద్ధి చేయగా, ఛాతి ఆసుపత్రి లో పాక్షికంగా సేవలందిస్తున్నారు.