Rajya Sabha Elections 2024
Rajya Sabha Elections 2024 : ఏపీలో హైఓల్టేజ్ పాలిటిక్స్ కు తెరలేచింది. ఇప్పటికే ఎన్నికల హీట్ తో పొలిటికల్ సర్కిల్స్ లో హైటెంపరేచర్ కనిపిస్తుంటే.. అంతకుమించి అన్నట్లుగా రాజ్యసభ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. సభలో సంపూర్ణ మెజార్టీతో ఖాళీ అయిన మూడు స్థానాలను గెలుచుకునే అవకాశం వైసీపీకి ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో చెలరేగిన అసంతృప్తి కొత్త చర్చకు తెరలేపుతోంది. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి షాక్ ఇచ్చిన టీడీపీ.. అప్పట్లో నలుగురు అసంతృప్తి ఎమ్మెల్యేలతో ఏ విధంగా విజయం సాధించిందో ఇప్పుడు కూడా అదే ప్లాన్ లో భాగంగా వైసీపీపై అసమ్మతితో రగిలిపోతున్న 30 మంది ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. సభలో బలం లేకపోయినా రాజ్యసభ బరిలో దిగాలనే చంద్రబాబు ఆలోచనలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి.
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు హైవోల్టేజ్ పాలిటిక్స్కు తెరతీస్తున్నాయి. గెలిచేంత బలం లేకపోయినా.. పోటీలో నిలవాలని టీడీపీ నిర్ణయించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య టామ్ అండ్ జెర్రీ పోరాటం ఖాయంగా కనిపిస్తోంది. సభలో పూర్తి మెజార్టీ ఉన్నా.. ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో విశాఖ ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదంతోపాటు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఈ ఖాళీల భర్తీ కోసం ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇందుకోసం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది.
Also Read : పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? ఈ 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం
షెడ్యూల్ విడుదలతో రాజ్యసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. వాస్తవానికి సభ్యుల సంఖ్య ప్రకారం ఈ మూడు స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఐతే ఇటీవల ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించడంతో.. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల పోరు హీట్ పుట్టిస్తోంది.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో ఇప్పటికే వైసీపీ పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కానీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేర్పుల్లో 26 మంది సిట్టింగ్లకు సీట్లు నిరాకరించడంతో ఏమైనా జరగొచ్చనే అనుమానం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే ముందస్తు జాగ్రత్తతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విశాఖ ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అదే విధంగా పార్టీ ధిక్కారం ఆరోపణలతో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా పథకం వేసింది. ఇది పసిగట్టిన టీడీపీ కూడా వైసీపీలోకి జంప్ అయిన నలుగురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. ఇలా రెండు వైపులా చెరి నాలుగు ఓట్లు తగ్గడమే.. అటు.. ఇటు.. అవ్వడమో జరగే అవకాశం ఉంది.
మూడు సీట్లు గెలుచుకుంటామనే ధీమాతో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఎప్పుడో ప్రకటించింది వైసీపీ. ఆ పార్టీ తరపున పెద్దలు సభకు పంపేందుకు సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును ఎంపిక చేసింది. ఎన్నికల్లో ఎలాంటి ట్విస్టులు లేకపోతే ఈ ముగ్గురు ఎన్నిక కావడం లాంఛనమే. కానీ, టీడీపీ తన అభ్యర్థిని నిలిపేందుకు వ్యూహం రచిస్తుందనే సమాచారమే అధికార పార్టీలో కలవరం పుట్టిస్తోంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ హై అలర్ట్గా వ్యవహరిస్తోంది.
Also Read : రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ.. మహిళ సహా ముగ్గురు పోటీ
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే ప్రస్తుత సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కొక్కరికి 44 ఓట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరుపార్టీల బలాబలాలను పరిశీలిస్తే.. టీడీపీకి గెలిచే చాన్స్ ఏ మాత్రం కనిపించడం లేదు. కానీ, వైసీపీ టికెట్లు నిరాకరించిన 26 మందితోపాటు ఆ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను కలిపితే సుమారు 30 మంది శాసనసభ్యులు టీడీపీతో చర్చలు జరుపుతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఝలక్తో కంగుతిన్న వైసీపీ అధిష్టానం ఈ సారి.. టీడీపీ వ్యూహానికి దీటైన ప్రతివ్యూహం రచిస్తుందంటున్నారు. మొత్తానికి రాజ్యసభ ఎన్నికల చదరంగంలో ఏ పార్టీ ఎలా పావులు కదుపుతుందనేది ఒక్కటే ఉత్కంఠగా మారింది.