హైదరాబాద్: పల్లె పోరులోనూ గులాబీ గుబాళించింది. పంచాయతీల్లో కారు దూసుకుపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదార్ల హవా కొనసాగింది. మూడింట రెండు వంతల సర్పంచ్ పదవులు అధికారపార్టీ బలపర్చిన వారికే దక్కాయి. దీంతో ఎన్నికలు ఏవైనా.. గులాబీ దండుకు తిరుగులేదని ప్రజలు మరోసారి నిరూపించారు.
హైదరాబాద్: పల్లె పోరులోనూ గులాబీ గుబాళించింది. పంచాయతీల్లో కారు దూసుకుపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదార్ల హవా కొనసాగింది. మూడింట రెండు వంతల సర్పంచ్ పదవులు అధికారపార్టీ బలపర్చిన వారికే దక్కాయి. దీంతో ఎన్నికలు ఏవైనా.. గులాబీ దండుకు తిరుగులేదని ప్రజలు మరోసారి నిరూపించారు.
* పల్లెపోరులోనూ గుబాళించిన గులాబీ
* హవా కొనసాగించిన టీఆర్ఎస్ మద్దతుదార్లు
* 4వేల 479 పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ
* 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం
* మొదటి విడతలో 3,710 సర్పంచ్.. 28వేల 974 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్
* ఏకగ్రీవాలతో కలిపి 2,769 సర్పంచ్ పదవులు గెల్చుకున్న టీఆర్ఎస్ మద్దతుదారులు
* కాంగ్రెస్ 917, బీజేపీ 66, టీడీపీ 29, సీపీఎం 33, సీీపీఐ 14 సర్పంచ్ పదవులు కైవసం
* 642 పంచాయతీల్లో ఇతరుల పాగా
తెలంగాణలో 2019, జనవరి 21వ తేదీ సోమవారం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదార్ల హవా కొనసాగింది. మూడింట రెండు వంతుల సర్పంచ్ పదవులు టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే దక్కించుకున్నారు. తొలి విడతలో 4,479 పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ కాగా.. 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3వేల 710 సర్పంచ్ పదవులు.. 28వేల 974 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది. 29వేల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా.. పురుషుల కంటే మహిళలే అత్యధికంగా పాల్గొన్నారు. ఏకగ్రీవాలతో కలిపి 2వేల 769 సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 917 సర్పంచ్ పదవులను కాంగ్రెస్ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 66 చోట్ల, టీడీపీ అభ్యర్థులు 29 చోట్ల గెలిచారు. ఇక సీపీఎం బలపర్చిన అభ్యర్థులు 33 పంచాయతీలు గెల్చుకోగా…. సీపీఐ బలపర్చిన అభ్యర్థులు 14 పల్లెలను కైవసం చేసుకున్నారు. ఇతరులు 642 పంచాయతీల్లో పాగా వేశారు.
* తొలి విడతలో రికార్డు స్థాయిలో పోలింగ్
* రాష్ట్ర వ్యాప్తంగా 85.76శాతం పోలింగ్ నమోదు
* యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 95.32శాతం పోలింగ్
* అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 68.25శాతం పోలింగ్
* కంసాన్పల్లిలో 99.48శాతం పోలింగ్ నమోదు
* జనగాం, వరంగల్ రూరల్, పెద్దపల్లి జిల్లాల్లో మూడు వార్డుల్లో రీ-పోలింగ్
* చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం
తొలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 85.76 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలను సవాల్గా తీసుకుని ఓటరును పోలింగ్ కేంద్రం వరకు రప్పించడంలో బరిలో ఉన్న అభ్యర్థులు పోటీ పడ్డారు. ఫలితంగా పెద్దఎత్తున పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రికార్డు స్థాయిలో 95.32 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 68.25 శాతం నమోదు అయ్యింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కాంసాన్పల్లిలో 99.48 శాతం పోలింగ్ జరగడం గమనార్హం. జనగాం, వరంగల్ రూరల్, పెద్దపల్లి జిల్లాల్లోని మూడు వార్డుల్లో రీ -పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల స్వల్ప ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు.
* బచ్చన్న పేట పంచాయతీ మూడో వార్డులో బ్యాలెట్ పేపర్లో తప్పులు
* 77 ఓట్లు పోలైన తర్వాత గుర్తించిన అధికారులు
* 30న రీ-పోలింగ్
* పంచాయతీ ఎన్నికల్లోనూ ఓట్లు గల్లంతు