BSP MLA Assassination: బీఎస్పీ ఎమ్మెల్యే హత్యపై దద్దరిల్లిన యూపీ అసెంబ్లీ.. యోగి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం
అఖిలేష్ ఆరోపణలపై సీఎం యోగి స్పందిస్తూ, ప్రయాగ్రాజ్ సంఘటనల వంటి దుశ్చర్యలను తన ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని తెలిపారు. ఏమాత్రం పక్షపాతం లేని పాలసీతో ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న నేరస్థుడు సమాజ్వాదీ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తని యోగి ఆరోపించారు. ఆయనను పార్లమెంటు సభ్యునిగా చేసింది సమాజ్వాదీ పార్టీ కాదా? అంటూ నిలదీశారు
- tony bekkal
- Published On : February 25, 2023 / 07:20 PM IST
The UP assembly heated by the assassination of BSP MLA.. War of words between Yogi and Akhilesh
BSP MLA Assassination: బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసు సహా ఆయన హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన సాక్షి ఉమేశ్ పాల్ హత్యా ఉదంతంపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీని కుదిపివేసింది. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రయాగ్రాజ్లోని తన నివాసంలో ఉమేశ్ పాల్ను అతి కిరాతకంగా హత్య చేయడాన్ని అఖిలేష్ ప్రస్తావిస్తూ బహిరంగంగా తుపాకులు స్వైరవిహారం చేస్తుండటమే రామరాజ్యమా? అని నిలదీశారు. ఇక మాఫియాకు సమాజ్వాదీ పార్టీ అండదండలు అందిస్తోందని యోగి ఆరోపించారు.
Kharge vs Amit Shah: అహంకారానికి పరాకాష్ట.. అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ ఖర్గే
రాజు పాల్ హత్య 2015లో జరిగింది. ఆయన అలహబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించిన కొద్ది నెలల్లోనే ఈ దారుణం జరిగింది. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీంను ఆయన ఓడించారు. ఈ కేసులో అతిక్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ నిందితులు. ఈ కేసులోని నిందితులంతా ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇక తాజా హత్య విషయానికి వస్తే, ఉమేశ్ పాల్ ప్రయాగ్రాజ్లోని తన నివాసంలో ఉండగా, శుక్రవారం ఆయనపై పెట్రోలు బాంబులతో దాడి చేసి, కాల్పులు జరిపి, హత్య చేశారు. ఆయనకు భద్రత కల్పిస్తున్న సెక్యూరిటీ గార్డు సైతం ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. యూపీ పోలీసుల ప్రకారం, ఉమేశ్ పాల్పై దాడికి పాల్పడినవారు ఆయన ప్రయాణించిన కారును వెంటాడారు. తమ బ్యాగుల్లో క్రూడ్ బాంబులను తీసుకొచ్చారు. ఓ నిందితుడు తన బ్యాగులో నుంచి ఓ క్రూడ్ బాంబును తీసి, ఉమేశ్పై విసిరినట్లు ఒక వీడియోలో కనిపించింది.
శనివారం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ ఈ హత్యాకాండల గురించి ప్రస్తావించారు. ఉమేశ్ పాల్ను, ఆయన సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్ న్యాయవాది కూడానని, శుక్రవారం బాంబులు విసిరిన తీరును పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టమవుతోందని విమర్శించారు. గ్యాంగ్ వార్ వంటి పరిస్థితి కనిపించిందన్నారు. బహిరంగంగా తుపాకులు స్వైరవిహారం చేస్తుండటమే రామరాజ్యమా? అని నిలదీశారు. పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, బీజేపీ బాధ్యత వహించాలని అఖిలేష్ డిమాండ్ చేశారు.
అఖిలేష్ ఆరోపణలపై సీఎం యోగి స్పందిస్తూ, ప్రయాగ్రాజ్ సంఘటనల వంటి దుశ్చర్యలను తన ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని తెలిపారు. ఏమాత్రం పక్షపాతం లేని పాలసీతో ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న నేరస్థుడు సమాజ్వాదీ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తని యోగి ఆరోపించారు. ఆయనను పార్లమెంటు సభ్యునిగా చేసింది సమాజ్వాదీ పార్టీ కాదా? అంటూ నిలదీశారు. ఈ మాఫియాలను తాము వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ‘‘మీరు (సమాజ్వాదీ పార్టీ) నేరగాళ్లకు మద్దతిస్తున్నారు. పూలమాలలు వేసి స్వాగతిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి నాటకాలు ఆడుతున్నారు’’ అంటూ యోగి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
