Ys Jagan: రూటు మార్చిన జగన్? వైఎస్సార్ సన్నిహితులతో మంతనాలు అందుకోసమేనా?
తెరవెనుక రాజకీయం నడపటంలో..పవర్ ఫుల్ స్ట్రాటజీస్ వేయడంలో కేవీపీ తర్వాతే ఎవరైనా అనే చర్చ ఉంది. అలాంటి కేవీపీని ఈ మధ్యే చెన్నైలో తన అన్న కొడుకు వివాహ వేడుకలో కలిశారు జగన్.
Ys Jagan Representative Image (Image Credit To Original Source)
- సలహాలు కోసం కేవీపీతో మంతనాలు జరుపుతున్నారా?
- ఉండవల్లి అరుణ్కుమార్ సూచనలు కోరుతున్నారా?
- సీనియర్ నేతలకు జగన్ టచ్లోకి వెళ్లారన్నది నిజమేనా?
Ys Jagan: గతం గతః. మళ్లీ అధికారంలోకి వచ్చేదెలా? వైఎస్ జగన్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటన, పాదయాత్రను ప్లాన్ చేస్తున్న వైసీపీ అధినేత..పలువురు సీనియర్ లీడర్లకు మళ్లీ టచ్లోకి వెళ్తున్నారట. మీ సలహాలు మాకెంతో అమూల్యమైనవి అంటూ..పలువురు పెద్దలకు టచ్లోకి వెళ్తున్నారన్న టాక్ బయలుదేరింది. జగన్ ఎందుకు రూట్ మార్చినట్లు? కూటమిని ఢీకొట్టాలంటే సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకోక తప్పదని ఫిక్స్ అయ్యారా? వైఎస్సార్ సన్నిహితులు జగన్ మేలు కోరి పనిచేసేనా?
పార్టీ ఓడినప్పటి నుంచి వైసీపీలో చాలా మంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు. మరికొంతమంది ఫ్యాన్ స్విచ్చాఫ్ చేసి పక్కదార్లు వెతుక్కున్నారు. ఈ క్రమంలో సరైన సమయంలో పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించే సీనియర్ నేతలెవరూ లేరు. ఒక బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేత ఎంత మాట్లాడుతున్నా రొటీన్ అయిపోతుందన్న చర్చ ఉందట. దీంతో తన తండ్రి వైఎస్సార్కు సన్నిహితంగా ఉన్న సీనియర్ లీడర్ల సలహాలు, సూచనలు కోరే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. పైగా వైసీపీని వీడిన లీడర్లలో చాలామంది తిరుగుముఖం పట్టేందుకు రెడీ అవుతున్నారట. అలాంటి వారిని తిరిగి చేర్చకునేందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్య నాయకుల సమావేశంలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ను గుర్తు చేస్తున్నారు నేతలు. పరిస్థితులు, ఇబ్బందులను బట్టి కొందరు వెళ్ళిపోయినా వారిని నేను అర్థం చేసుకుంటాను. తిరిగి పార్టీలోకి వస్తామంటే వెల్కమ్ అంటూ చెప్పారు. ఇక మరికొందరు నేతలు ఏ పార్టీతో సంబంధం లేకుండా యాక్టీవ్ పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు. వైఎస్సార్ సన్నిహితులుగా జగన్ మేలు కోరుకునే వాళ్లు ఉన్నారు. అలాంటి వారి సలహాలు, సూచనల కోసం తీసుకుంటే బాగుంటుందనే థాట్కు జగన్ వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు.
తెరవెనుక రాజకీయం నడపటంలో..పవర్ ఫుల్ స్ట్రాటజీస్ వేయడంలో కేవీపీ తర్వాతే ఎవరైనా అనే చర్చ ఉంది. అలాంటి కేవీపీని ఈ మధ్యే చెన్నైలో తన అన్న కొడుకు వివాహ వేడుకలో కలిశారు జగన్. హౌ ఆర్ యు అంకుల్ అంటూ జగన్ పలకరించారు. ఆ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేవీపీ జగన్ అంత సన్నిహితంగా ఆనందంగా మాట్లాడుకోవడం ఆ మధ్య కాలంగా ఎవరూ చూసింది లేదు. దాంతో అది పెద్ద చర్చగా మారింది.
కేవీపీ, ఉండవల్లితో ప్రత్యేకంగా జగన్ భేటీ..!
ఇదిలా ఉంటే లేటెస్ట్గా బెంగళూరులో కేవీపీతో జగన్ చర్చలు జరిపారని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతుందో తెలియదు కానీ..జగన్ తన రూట్ను మార్చుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. సీనియర్లు.. పైగా తన తండ్రికి సన్నిహితులుగా ఉన్న నేతలతో జగన్ సంప్రదింపులు జరపడం వెనక పెద్ద ప్లానే ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. కేవీపీతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వంటి నేతల డైరెక్షన్ ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉందా అన్న ఎనాలిసిస్లు స్టార్ట్ అయ్యాయి. కేవీపీతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయి ఫ్యూచర్ ప్లాన్స్పై డిస్కస్ చేసినట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ తరఫున ఏకంగా 12ఏళ్ల పాటు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2020లో ఆయన రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా వయసు రిత్యా యాక్టీవ్ పాలిటిక్స్ చేయడం లేదు. అయితే కేవీపీ మంచి వ్యూహకర్త అన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే తెరవెనుక మంత్రాంగం కోసం కేవీపీ సేవలను వాడుకుంటే జగన్కు చాలా ప్లస్ పాయింట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఇప్పటికే మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును పార్టీ హెడ్ ఆఫీస్లో కీలక బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్తో కలయిక కోసమా? వైసీపీ బలోపేతం కోసమా?
సీనియర్ నేతల వాక్చాతుర్యం, సలహాలు, సూచనలతో కూటమిని ఢీకొట్టి..వచ్చేసారి అధికారంలోకి వచ్చి తీరాలని కసి మీదున్నారట జగన్. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, వైసీపీ ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంబటి రాంబాబును పరామర్శించిన తర్వాత, తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వంపై ఉండవల్లి చేసిన విమర్శలు వైసీపీలో కొత్త ఆశలు రేకెత్తించినట్లు చెబుతున్నారు.
అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని ఉండవల్లి స్పష్టం చేస్తుండటంతో..ఆయన సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇటు కేవీపీ, అటు ఉండవల్లి ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పలుకుబడి కలిగిన నాయకులు. కేవీపీతో భేటీ..కాంగ్రెస్తో కలయిక కోసమా లేక ఏపీలో వైసీపీ బలోపేతం కోసం సజిషన్స్ అడిగారా అన్నది పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది.
Also Read: పీక్స్కి కల్తీ నెయ్యి ఇష్యూ.. ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతోంది? క్లైమాక్స్కు చేరేదెప్పుడు?
