Karnataka Effect: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుపై మమతా బెనర్జీ ఫార్ములా
కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ దేశ రాజకీయాలపై పడింది.
- T Venkateshwarlu
- Published On : May 15, 2023 / 07:17 PM IST
Mamata Banerjee
Mamata Banerjee: కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) పార్టీ విజయం సాధించడంతో దేశ రాజకీయాల్లోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఐక్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలంగా ఉందో ఆ ప్రాంతాల్లో తాను 2024 లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections 2024) ఆ పార్టీకి మద్దతు తెలుపుతానని మమతా బెనర్జీ చెప్పారు. “కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఆ ప్రాంతాల్లో ఆ పార్టీని పోటీ చేయనివ్వాలి. మేము కూడా మద్దతు ఇస్తాము. ఇందులో తప్పేం లేదు. అయితే, ఇతర రాజకీయ పార్టీలకు కూడా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి” అని మమతా బెనర్జీ అన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
“ఏ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో అక్కడ బీజేపీ పోటీ చేయదు. రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలు అంతా కలిసి పోరాడాలి. కర్ణాటకలో నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాను. అయితే, పశ్చిమ బెంగాల్లో మాపై కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదు” అని మమతా బెనర్జీ చెప్పారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం పాటిస్తామని కొన్ని వారాల క్రితమే మమతా బెనర్జీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమెతో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్చించారు. ఆ సమయంలో మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
CM of Karnataka: కర్ణాటక సీఎం పదవిపై రాహుల్, ప్రియాంక చెరోవైపు.. ఇంతకీ ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలుసా?
