TTD : శ్రీవారి ఆలయంలో భక్తుల ఆందోళన, పెద్ద ఎత్తున నినాదాలు

గురువారం మధ్యాహ్నం 2గంటల నుంచి కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులను సాయంత్రం 6గంటలకు కూడా దర్శనానికి అనుమతించకపోవడం, మంచినీరు, అల్పాహారం, పాలు అందుబాటులో...

  • Published On : January 14, 2022 / 10:46 AM IST

Ttd

Devotees Slogans In Tirupati : తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం వ‌ద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు శ్రీవారి ఆలయంలో ఆందోళనకు దిగారు. క్యూలైన్లలో తాము గంటల తరబడి వేచి ఉన్నామని సర్వదర్శనం భక్తులు అసహనం వ్యక్తంచేశారు. 2022, జనవరి 13వ తేదీ గురువారం మధ్యాహ్నం 2గంటల నుంచి కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులను సాయంత్రం 6గంటలకు కూడా దర్శనానికి అనుమతించకపోవడం, మంచినీరు, అల్పాహారం, పాలు అందుబాటులో లేకపోవడంతో భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

Read More : Jallikattu : నో మాస్క్..భౌతిక దూరం లేదు..జల్లికట్టు పోటీలు ప్రారంభం

గురువారం ఉదయం 8గంటల నుంచి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనం రోజు ఏటా లక్షమంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. కానీ, ఈ ఏడాది ఏకాదశి తొలి రోజు 45వేల మందికి టికెట్లు జారీ చేశారు. అయినా, భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సిఫారసు లేఖలు ఉన్నవారిని సుపథం నుంచి అనుమతిస్తూ రూ.300ల టికెట్‌ కొనుగోలు చేసిన వారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు కంపార్ట్‌మెంట్లలోనే కూర్చోబెట్టడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలో స్వామి దర్శనం కోసం మహాద్వారం వద్దకు చేరుకున్న భక్తులు ఒక్కసారిగా టీటీడీ ఈవో, అదనపు ఈవో వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు భక్తులకు సర్దిచెప్పి ఆలయంలోకి పంపించారు.