×
Ad

Muchintal : శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రెండో రోజు కార్యక్రమాలు

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను

  • Published On : February 3, 2022 / 07:00 AM IST

Sri Ramanuja Sahasrabdi Celebrations 2022 February 03rd

State Equality : ముచ్చింతల్‌లో మహత్తర ఘట్టం ప్రారంభమైంది. అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి..సమతాస్ఫూర్తిని చాటిన సమతామూర్తి శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు 2022, ఫిబ్రవరి 02వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. అంతకుముందు శ్రీరామనగరంలోని దేవాలయం నుంచి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. భారీగా తరలివచ్చిన భక్తజనం యాత్రలో పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నేతృత్వంలో ఈ యాత్ర సాగింది. యాగశాల దగ్గర వాస్తుశాంతి హోమం నిర్వహించారు. 12 రోజుల్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా వాస్తుశాంతి హోమం జరుపుతారు.

Read More : MS Dhoni : ‘అధర్వ’గా ధోని.. కత్తి పట్టుకొని కొత్త అవతారం..

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను వెలిగించి హోమాలు ప్రారంభిస్తారు. ఇష్టిశాలల వద్ద దుష్ట నివారణకు శ్రీసుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్దికి శ్రీవాసుదేవేష్టి చేస్తారు. అనంతరం శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు యాగశాలలో యజ్ఞం నిర్వహించనున్నారు. అనంతరం ఒంటి గంట వరకు పూర్ణాహుతి – ప్రసాద వితరణ కార్యక్రమం జరగనుంది. ఇక సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు యాగశాలలో హోమం చేపట్టనున్నారు. 5 గంటల నుంచి 5.30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.. 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అతిథుల ప్రసంగాలు జరగనున్నాయి. అనంతరం రాత్రి 8 గంటల వరకు శ్రీరామానుజచార్య లైవ్ లేజర్ షో నిర్వహించనున్నారు.

Read More : AP Employees : చలో విజయవాడ.. ఉద్యోగుల అరెస్టుల పర్వం

ముచ్చింతల్‌లో సందడి నెలకొంది. ఆశ్రమం ఆవరణలోనే కాదు… స్పూర్తి కేంద్రానికి వెళ్లే మార్గాలన్నింటిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. యజ్ఞం కోసం ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్లు, అందమైన రంగవల్లులతో ఆశ్రమ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. 12 రోజుల పాటు చినజీయర్ స్వామి పర్యవేక్షణలో క్రతువు కొనసాగుతుంది. ఉత్సవాలలో భాగంగా భారీ స్థాయిలో లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం, 108 దివ్యదేశాల ప్రతిష్ట, కుంభాభిషేకం, స్వర్ణమయ రామానుజ ప్రతిష్ట, సమతామూర్తి లోకార్పణ జరుగుతాయి. అలాగే నాలుగు వేదాలకు చెందిన 7 శాఖల పారాయణం, హవనం, పదికోట్ల అష్టాక్షరీ మహామంత్ర జపం, కోటి మంత్ర హవనం, పురాణ, ఇతిహాస, ఆగమ గ్రంథాల పారాయణం నిర్వహిస్తారు. హోమాల్లో 5వేలమంది రుత్విక్కులు పాల్గొంటారు. ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో పాల్గొనేందుకు, వాలంటీర్లగా విధులు నిర్వహించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.