Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చక్రస్నానానికి పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు శనివారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ..
- Harishth Thanniru
- Published On : October 11, 2024 / 07:59 AM IST
Tirumala
Tirumala Brahmotsavam 2024: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం 7గంటల నుంచి శ్రీవారి రథోత్సవం ప్రారంభమైంది. మహారథంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేస్తున్నారు. ఇవాళ రాత్రికి స్వామివారు అశ్వాహనంపై విహరించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం శనివారం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read; దువ్వాడ శ్రీనివాస్, మాధురిలకు షాక్..! తిరుమలలో కేసు నమోదు..
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు శనివారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీటీడీ అధికారులు పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొత్త నీటిని నింపి, వందశాతం క్లోరినేషన్ చేశారు. ప్రత్యేకంగా ఇనుప చైన్ లింక్ కంచెలు నిర్మించారు. వరాహస్వామి ఆలయం వద్ద పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వార్ కు పుణ్యస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక చక్రస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను ఉదయం 4గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. భక్తులు రోజంతా పుణ్యస్నానాలు చేయవచ్చునని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు.
పుష్కరిణి వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గజ ఈతగాళ్లను, అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసు, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయం చేసుకుంటూ చక్రస్నానం సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామలరావు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
