1983 World Cup : పసికూన అనుకున్న జట్టు.. విశ్వవిజేతగా నిలిచి 40 ఏళ్లు
వెస్టిండీస్ కు ఓటమిని రుచి చూపిస్తూ కపిల్ డెవిల్స్ లార్డ్స్ బాల్కనీ నుంచి ప్రపంచకప్ ట్రోఫీని తీసుకోవడం ఎవ్వరూ మరిచిపోయి ఉండరు. భారత క్రికెట్ చరిత్ర గతిని మార్చేసిన ఈ ప్రపంచ కప్ విజయం సాధించి నేటికి సరిగ్గా 40 ఏళ్లు.
- Thota Vamshi Kumar
- Published On : June 25, 2023 / 02:57 PM IST
1983 World Cup
1983 World Cup Win : అది 1983, జూన్ 25.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనానికి వేదిక అవుతుందని కనీసం ఒక్కరు కూడా ఊహించలేదు. అండర్ డాగ్గా బరిలోకి దిగిన భారత జట్టు(Team India) ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్కు చేరగా.. అప్పటికే రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన అరివీర భయంకర వెస్టిండీస్(West Indies) వరుసగా మూడో సారి ప్రపంచకప్ను ముద్దాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్కు అతిథ్యం ఇచ్చింది. అయితే.. వెస్టిండీస్ కు ఓటమిని రుచి చూపిస్తూ కపిల్ డెవిల్స్ లార్డ్స్ బాల్కనీ నుంచి ప్రపంచకప్ ట్రోఫీని తీసుకోవడం ఎవ్వరూ మరిచిపోయి ఉండరు. భారత క్రికెట్ చరిత్ర గతిని మార్చేసిన ఈ ప్రపంచ కప్ విజయం సాధించి నేటికి సరిగ్గా 40 ఏళ్లు.
ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ (38), మొహిందర్ అమర్నాథ్ (26), సందీప్ పాటిల్ (27) లు మాత్రమే రాణించగా మిగిలిన వారు విఫలం అయ్యారు. చాలా తక్కువ స్కోరుకే టీమ్ఇండియా పరిమితం కావడంతో వరుసగా మూడో సారి విండీస్ విజేతగా నిలవడం ఖాయమని అంతా బావించారు. సంబరాలు కూడా మొదలుపెట్టేశారు. అయితే.. బ్యాటింగ్లో విఫలమైన భారత్ బౌలింగ్లో మాత్రం సత్తా చాటింది. వివ్ రిచర్డ్స్(33), గ్రీనిడ్జ్(1), హేన్స్(13), సర్ క్లైవ్ లాయిడ్(8) వంటి హేమాహేమీ బ్యాటర్లను కట్టడి చేసింది. 52 ఓవర్లలో 140 పరుగులకే వెస్టిండీస్ ఆలౌటైంది. మొహిందర్ అమర్నాథ్, మదన్ లాల్ లు చెరో మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు.
1983 World Cup
ఈ విజయం భారత క్రికెట్ గతిని పూర్తిగా మార్చేసింది. దేశంలో క్రికెట్కు ఆదరణ పెరగడానికి కారణంగా నిలిచింది. అదే సమయంలో వెస్టిండీస్ పతనం కూడా ప్రారంభమైంది. కాగా.. భారత్ మరోసారి ప్రపంచకప్ను అందుకోవడానికి 28 ఏళ్లు పట్టింది. 2011లో ధోని సారథ్యంలో శ్రీలంకను ఓడించిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ ఏడాది భారత్ వేదికగా ప్రపంచకప్ జరగనుండడంతో భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వీడియో.. బీసీసీఐకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడా?
40 వసంతాలు పూర్తి కావడంతో..
భారత జట్టు మొదటి సారి ప్రపంచకప్ గెలిచి నేటికి 40 వసంతాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని 1983 నాటి హీరోలు మళ్లీ ఒక్క చోట చేరి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సునీల్ గవాస్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో కపిల్ దేవ్, శ్రీకాంత్, మదన్ లాల్, దిలీప్ వెంగ్ సర్కార్, సందీప్ పాటిల్, అమర్నాథ్, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్విందర్ సింగ్, రోజర్ బిన్నీలతో పాటు అప్పటి టీమ్ మేనేజర్ మాన్సింగ్ కూడా ఉన్నారు. కాగా.. ఈ జట్టులో భాగమైన యశ్పాల్ శర్మ రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే.
