Abhishek Sharma : పాక్తో ఫైనల్ మ్యాచ్.. రోహిత్, కోహ్లీ, రిజ్వాన్ల రికార్డులను అభిషేక్ శర్మ బ్రేక్ చేస్తాడా?
ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్కు ముందు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి
- Thota Vamshi Kumar
- Published On : September 28, 2025 / 10:56 AM IST
Abhishek Sharma
Abhishek Sharma : ఆసియాకప్ 2025 చివరి అంకానికి చేరుకుంది. దుబాయ్ వేదికగా నేడు (ఆదివారం సెప్టెంబర్ 28) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ ఈ టోర్నీలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆరు మ్యాచ్ల్లో 51.50 సగటు 204.63 స్ట్రైక్రేటుతో 309 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక పాక్తో ఫైనల్ మ్యాచ్లో అతడు 11 పరుగులు చేస్తే బహుళ దేశాల టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టీమ్ఇండియా బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీని అధిగమిస్తాడు. 2014 టీ20 ప్రపంచకప్లో కోహ్లీ 6 మ్యాచ్ల్లో 319 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి.
WI vs NEP : టీ20 క్రికెట్లో నేపాల్ సంచలనం.. తొలి టీ20లో వెస్టిండీస్ పై విజయం
23 పరుగులు చేస్తే..
పాక్తో మ్యాచ్లో అభిషేక్ 23 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20 టోర్నీ లేదా సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్సాల్ట్ను అధిగమిస్తాడు. సాల్ట్ 2023లో విండీస్ పర్యటనలో ఐదు టీ20ల్లో 331 పరుగులు సాధించాడు.
రోహిత్, రిజ్వాన్ వెనక్కి నెట్టి..
పాక్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ 30 ఫ్లస్ పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వరుసగా అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్లను అధిగమిస్తాడు.
2021 నుంచి ఫిబ్రవరి 22 వరకు రోహిత్ శర్మ, 2021 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రిజ్వాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వరుసగా ఏడు సార్లు 30 ఫ్లస్ స్కోర్లు సాధించారు. ఆసియాకప్లో అభిషేక్ ఆరు మ్యాచ్ల్లోనూ సాధించాడు. అంతకముందు ఇంగ్లాండ్ పై ఈ ఏడాది ఫిబ్రవరి 2న సెంచరీ చేశాడు.
