BCCI: భారత్ వేదికగా ఈనెల అక్టోబర్, నవంబర్ నెలల్లో ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఐసీసీ స్టేడియంలతో పాటు, మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని మొత్తం పది స్టేడియాల్లో మెగా టోర్నీకి సంబంధించిన మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే ఆ మైదానాలను అన్నిరకాలుగా బీసీసీఐ ముస్తాబు చేస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్లలో భాగంగా బీసీసీఐ తెలుగు రాష్ట్రాల్లోని స్టేడియంలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. వైజాగ్ స్టేడియంలో ఎలాంటి మ్యాచ్ జరగడం లేదు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ ఆడే మ్యాచ్ లేకుండానే షెడ్యూల్ ప్రకటించింది. తాజాగా.. భారత క్రికెట్ జట్టు సెప్టెంబరు నుంచి ఆరు నెలల వ్యవధిలో సొంతగడ్డపై ఆడే అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ మ్యాచ్లలో రెండు టెస్టు మ్యాచ్లు, రెండు టీ20 మ్యాచ్లు వైజాగ్, హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి.
World Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ తేదీ మారే అవకాశం…బీసీసీఐ పున: పరిశీలన
వన్డే ప్రపంచ కప్లో ఆశించిన ప్రాధాన్యత దక్కని నగరాల్లో వరల్డ్ కప్ కంటే ముందు, ఆ తరువాత భారత్ వేదికగా జరిగే మ్యాచ్లు ఆడేందుకు బీసీసీఐ పెద్దపీట వేసింది. ఈ క్రమంలో ప్రపంచ కప్ అతిథ్య అవకాశం దక్కని వైజాగ్కు, మెగాటోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ దక్కించుకోలేక పోయిన హైదరాబాద్కు రెండేసి మ్యాచ్లను బీసీసీఐ కేటాయించింది. మెగా టోర్నీకి ముందు, మెగా టోర్నీకి తరువాత భారత్ స్వదేశంలో మ్యాచ్లు ఆడనుంది. బీసీసీఐ ప్రకటించిన షడ్యూల్ ప్రకారం.. అక్టోబరులో వరల్డ్ కప్ ప్రారంభంకానుండగా.. దానికంటే ముందే టీమిండియా చివరి వన్డే సిరీస్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. మూడు మ్యాచ్లు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతాయి. సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. మొహాలి, ఇండోర్, రాజ్కోట్ మైదానాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఐసీసీ వన్డే పురుషుల వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తరువాత టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిలో నవంబర్ 23న తొలి టీ20 మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది. నవంబర్ 26న (తిరువనంతపురం), 28న (గుహవాటి), డిసెంబర్ 1న (నాగ్పుర్), డిసెంబర్ 3న జరిగే చివరి టీ20 మ్యాచ్కు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ తరువాత.. భారత్ జట్టు ఆఫ్గానిస్థాన్ జట్టుతో జనవరి 11, 14, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్లు ఆడుతుంది. ఇందుకు మొహాలి, ఇండోర్, బెంగళూరు మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
2024 జనవరి నెలలో ఇంగ్లాండ్తో అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఆడనుంది. జనవరి 25 నుంచి 29 వరకు తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతుంది. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు జరిగే రెండో టెస్టు మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది. ఆ తరువాత మూడు టెస్టు మ్యాచ్లు రాజ్కోట్, రాంచి, ధర్మశాల మైదానాల్లో జరగనున్నాయి.