కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(సీఏఎస్)లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్కు ఎదురుదెబ్బ తగిలింది. సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని ఆమె చేసిన అప్పీల్ను సీఏఎస్ తిరస్కరించింది. కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ లో వినేశ్ కు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో ఇప్పుడు ఏం చేస్తారు..? వినేశ్ ఇంకెక్కడైనా అప్పీల్ చేసుకునే వీలుందా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. అలాంటి వీలు ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సీఏఎస్.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయాలకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేసే వీలుంది. అయితే.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ‘న్యాయపరంగా స్విస్ ఫెడరల్ ట్రెబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు ఛాన్స్ ఉంది. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రాథమిక విచారణ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడం, పబ్లిక్ పాలసీలో అననుకూలత వంటి కారణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.’అని సీఏఎస్ తన వెబ్సైట్లో పేర్కొంది.
Manu Bhaker : నీరజ్ చోప్రాతో పెళ్లి.. అవును నేను విన్నాను : మను భాకర్
కాగా.. సీఏఎస్ తీర్పుపై భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. వినేశ్కు మద్దతుగా ఉంటామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష భరోసా ఇచ్చారు. తదుపరి న్యాయపరమైన ఆప్షన్లపై దృష్టిసారించాం. క్రీడల్లో పారదర్శకతతో పాటు అథ్లెట్లకు న్యాయం జరగాలనేదే మా అభిమతం. వారి హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం అని ఐఓఏ తెలిపింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో వినేష్ ఫోగట్ అసాధారణ ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. అయితే.. ఫైనల్ బౌట్కు కొన్ని గంటల ముందు బరువు తూచే సమయానికి నిర్ణీత బరువు కన్నా 100 గ్రాముల అధిక బరువుతో ఉండడంతో అనర్హత వేటు పడింది. నిబంధనల ప్రకారం ఆమెకు చివరి ర్యాంకు కేటాయిస్తారు. దీంతో ఆమెకు ఎలాంటి పతకం రాకుండా పోయింది.