Champions Trophy 2025 : సెమీస్ చేరుకోవడంలో పాక్ విఫలం.. భారత్పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్ల అక్కసు.. మధ్యలో మీగోల ఏంది సామీ..
టీమ్ఇండియా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మరోసారి తమ అక్కసు వెళ్లగక్కారు.
- Thota Vamshi Kumar
- Published On : February 25, 2025 / 02:26 PM IST
Former England captains cry foul as India play all Champions Trophy 2025 matches in Dubai
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్కు చేరుకుంది. భారత జట్టు పై ఓవైపు ప్రశంసల వర్షం కురుస్తుండగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మాత్రం తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. మిగిలిన జట్లతో పోలిస్తే భారత్కు చాలా అనుకూతలు ఉన్నాయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు నాజర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్ తెలిపారు.
అన్ని జట్లు ఒక మ్యాచ్ తరువాత మరో మ్యాచ్ ఆడేందుకు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, ఒక్కొ మ్యాచ్ ఒక్కొ స్టేడియంలో ఆడుతున్నాయన్నారు. అయితే.. భారత్కు మాత్రం మ్యాచ్ల సందర్భంగా ఎలాంటి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని, అంతేకాకుండా అన్ని మ్యాచ్లను దుబాయ్ వేదికగానే ఆడే సౌలభ్యం ఒక్క భారత్కు మాత్రమే ఉందన్నారు. నిజం చెప్పాలంటే ఇది భారత్కు అదనపు ప్రమోజనం అని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్ సెమీస్ చేరడంలో విఫలమైన తరువాత ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.
“వారు ఒకే చోట, ఒకే హోటల్లో ఉన్నారు. వారు ప్రయాణించాల్సిన అవసరం లేదు. వారికి ఒకే డ్రెస్సింగ్ రూమ్ ఉంది. వారికి పిచ్ గురించి తెలుసు, వారు ఆ పిచ్ కోసం టీమ్ను ఎంచుకున్నారు” అని మాజీ ఆటగాడు నాజర్ హుస్సేన్ అన్నారు. దుబాయ్ వేదికగా మ్యాచ్లు ఆడతారని వారికి తెలుసు. అందుకనే దుబాయ్ పిచ్కు అనుగుణంగానే వారు ఐదుగురు స్పిన్నర్లను ఎంచుకున్నారు.
మిగిలిన జట్లను తీసుకుంటే పాకిస్తాన్, దుబాయ్ లోని విభిన్న పిచ్లను, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు ఇంగ్లాండ్ లాంటి జట్టు సెమీస్కు చేరుకుంటే వారికి ఒకే ఒక స్పిన్నర్ ఉంటాడు. ఇది అన్యాయం అని అన్నాడు.
నిస్సందేహంగా ఇది భారత్కు ప్రయోజనమే. భారత్, పాకిస్తాన్ కు రానని చెప్పింది. ఇలాంటి మేజర్ టోర్నీల్లో భారత్, పాక్ మ్యాచ్ లేకుండా ఊహించడం కష్టం. అందుకనే దుబాయ్ వేదికగా మ్యాచ్ నిర్వహించారని తెలిపాడు. భారత ఆటగాళ్లు హాయిగా ఒకే చోట కూర్చొని ఉంటారు. ఆరు గేములు ఆడతారు. అన్నింటిని వారు గెలిస్తే మరో పెద్ద ట్రోఫీ వారి సొంతం అవుతుందన్నారు.
