Rashid Latif : మీ బండారం మొత్తం బయటపెడుతూ.. బుక్ రాస్తున్నా.. ఎవరు, ఎప్పుడు, ఎలా.. పాక్ మాజీ కెప్టెన్ వార్నింగ్..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సంచనాత్మక ప్రకటన చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : March 11, 2025 / 12:06 PM IST
Former Pakistan Captain Rashid Latif vows to disclose darkest secret of cricket
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సంచనాత్మక ప్రకటన చేశాడు. ప్రస్తుతం తాను ఓ పుస్తకం రాస్తున్నానని, అందులో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలతో పాటు క్రికెట్ యొక్క చీకటి రహస్యాలను బయటపెడతానని చెప్పాడు. త్వరలోనే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపాడు.
1990లలో మ్యాచ్ ఫిక్సింగ్ తారా స్థాయికి చేరిందని చెప్పాడు. ఫిక్సింగ్ ఎలా జరిగింది, ఎవరు పాల్గొన్నారు వంటి అన్ని విషయాలను తాను బహిర్గతం చేయనున్నట్లు చెప్పాడు. అసలు 90లలో క్రికెట్లో ఏమీ జరిగింది. ఏ మాజీ కెప్టెన్ క్షమాపణ చెప్పాడో వంటి విషయాలను వెల్లడిస్తానని తెలిపాడు.
Rohit sharma : ఏమయ్యా రోహిత్ ఏందిది.. ఫోన్, పాస్పోర్టు గతం.. ఛాంపియన్స్ ట్రోఫీని కూడానా..
1992 నుండి 2003 వరకు పాకిస్థాన్ తరుపున 200కి పైగా అంతర్జాతీయ మ్యాచ్ల్లో లతీఫ్ ఆడాడు. 90 నాటి ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెట్కు దూరంగా ఉండాలని ఆయన సూచించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్తాన్ జట్టు గ్రూప్ స్టేజీ నుంచి నిష్ర్కమించడంతో రిజ్వాన్ నాయకత్వంలోని జట్టు పై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ లతిఫ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కొత్త విషయం కాదని, ఇది కాలక్రమేణా కొనసాగుతున్న సమస్య అని రషీద్ లతీఫ్ తెలిపారు. పాక్ ఐసీసీ టైటిళ్లను ఎందుకు గెలవలేకపోతుంది అన్న ప్రశ్న లతీఫ్ కు ఎదురైనప్పుడు.. 90లలో ఆడిన ఆటగాళ్లను జట్టు నుండి అలాగే యాజమాన్యం నుండి దూరంగా ఉంచాలని సూచన చేశాడు.
‘పాకిస్తాన్ మరో ప్రపంచ కప్ను గెలిచేందుకు 17 ఏళ్లు పట్టింది. ఇందుకు కారణం 90ల నాటి ఆటగాళ్లు పాక్ క్రికెట్ను విడవకపోవడమే. 90ల నాటి ఆటగాళ్లు మేనేజ్మెంట్ నుంచి జట్టు నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే ప్లేయర్లు గెలవడానికి ప్రయత్నిస్తారు. నేను 90ల నాటివాడినే. వారు చాలా కాలంగా పాక్ క్రికెట్ కు సేవ చేస్తున్నారు. ఇక విశ్రాంతి తీసుకుంటే మంచిదని భావిస్తున్నాను.’ అని లతీఫ్ అన్నాడు.
1990లో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. జట్టు పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించి.. దశాబ్దం చివరిలో జస్టిస్ మాలిక్ మొహమ్మద్ ఖయ్యూమ్ నేతృత్వంలో ఒక అధికారిక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏడాది పాటు విచారణ చేపట్టింది. ఆరోపణలను నిశితంగా పరిశీలించింది. మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్, సీమర్ అతా-ఉర్-రెహ్మాన్లపై జీవికాల నిషేదాన్ని విధించింది.
