Gambhir : ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించినప్పటికీ ఓటమి పాలైంది. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ చేధించి చరిత్ర సృష్టించింది. అయితే.. ఈ మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ సహనం కోల్పోయాడు. ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు.
ఈ మ్యాచ్లో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసింది. సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (75; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. కాగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ 14వ సందర్భంగా గంభీర్ కు కోపమొచ్చింది.
14వ ఓవర్ పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చహర్ వేశాడు. ఆఖరి బంతిని రసెల్ కవర్స్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతిని పంజాబ్ ఫీల్డర్ అశుతోష్ పట్టుకుని కీపర్ జితేశ్ శర్మకు విసిరివేశాడు. అయితే.. బాల్ అతడు పట్టుకోలేదు. ఓవర్ త్రోని గమనించిన రసెల్, వెంకటేశ్ అయ్యర్లు పరుగు తీశారు.
అయితే.. ఈ పరుగును కేకేఆర్, రసెల్ ఖాతాలో చేర్చేందుకు అన్ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి నిరాకరించాడు. అశుతోష్ బంతిని పట్టుకున్న తరువాత తాను ఓవర్ పూర్తి అయినట్లు చెప్పానని, ఓవర్ త్రో పరుగు లెక్కలోనికి రాదన్నాడు. క్రీజులోని బ్యాటర్లు దానిపై పెద్దగా స్పందించలేదు గానీ.. డగౌట్లో ఉన్న మెంటార్ గౌతమ్ గంభీర్ అక్కడే ఉన్న ఫోర్త్ అంపైర్ వద్దకు వెళ్లి ఆన్ఫీల్డ్ అంపైర్ల తీసుకున్న నిర్ణయం పై వాగ్వాదానికి దిగాడు. ఫోర్త్ అంఫైర్ సానుకూలంగా స్పందించకపోవడంతో గంభీర్ అసంతృప్తిగా అక్కడ నుంచి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాగా.. కేకేఆర్ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 108) చెలరేగిన జానీ బెయిర్ స్టో కోల్కతా ఆశలపై నీళ్లు పోశాడు.
— Nihari Korma (@NihariVsKorma) April 27, 2024