దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా ఓటమితో మొదలుపెట్టింది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచులో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం వర్షం కురవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు కుదించారు. సఫారీ జట్టు 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే.. ఈమ్యాచ్లో టీమ్ఇండియా తుది జట్టు ఎంపికపై పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రపంచ నంబర్ వన్ బౌలర్ను అలా ఎలా పక్కన బెడతారని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశ్నించాడు. నిజం చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ ను ఎందుకు తీసుకోలేలో అర్థం కాలేదన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచులో శ్రేయస్ హాఫ్ సెంచరీ చేశాడు. ఓ లెఫ్ట్ హ్యాండర్ కోసం అతడిని పక్కన బెట్టారా..? లేదా శ్రేయస్కు గాయమైందా..? అన్నది మేనేజ్మెంట్కే తెలియాలన్నాడు.
Shubman Gill : ఆక్సిజన్ ఫార్ములాకి గిల్ బ్యాటింగ్కి సంబంధం ఏమిటి..? శుభ్మన్ పై మీమ్స్ వైరల్
ఇక ప్రపంచ నంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్ ను తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. టాప్ క్లాస్ బౌలర్ను పక్కన బెట్టడం సరికాదన్నాడు. కీలక బౌలర్ను బెంచ్ కు ఎందుకు పరిమితం చేశారనే దానిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు టీమ్ మేనేజ్మెంట్ సమాధానం చెప్పాలన్నారు.
నిరుత్సాహానికి గురై ఉంటాడు..
మరో మాజీ ఆటగాడు పీయూష్ చావ్లా మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో రవి బిష్ణోయ్ అద్భుతంగా రాణించాడు. అతడు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాంటి ఆటగాడు తప్పకుండా తుది జట్లులో ఉండాలి. బెంచ్కే పరిమితం కావడం వల్ల అతడు తప్పకుండా నిరుత్సాహానికి గురై ఉంటాడని అన్నారు.