Rohit Sharma : వన్డే ప్రపంచకప్ ఓటమిపై తొలిసారి స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కోలుకోలేకపోయా..
వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో ఓటమి తరువాత నుంచి రోహిత్ శర్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. మొదటి సారిగా స్పందించాడు.
![Rohit Sharma : వన్డే ప్రపంచకప్ ఓటమిపై తొలిసారి స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కోలుకోలేకపోయా.. Rohit Sharma : వన్డే ప్రపంచకప్ ఓటమిపై తొలిసారి స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కోలుకోలేకపోయా..](https://10tv.in/wp-content/uploads/2023/12/New-Project-40.jpg)
Rohit Sharma On 2023 ODI World Cup
Rohit Sharma On 2023 ODI World Cup : నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచులో టీమ్ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రోహిత్ శర్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా ఓటమి పై కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి సారిగా స్పందించాడు. ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఓటమి బాధ నుంచి బయట పడడం తనకు చాలా కష్టంగా అనిపించిందన్నాడు. తన కుటుంబం, స్నేహితులు తనకు ఈ విషయంలో సాయం చేసినట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
‘నిజం చెప్పాలంటే.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచులో ఓడిపోవడం ఎంతో బాధను కలిగించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాను. దీన్ని నుంచి ఎలా బయటకు పడాలో నాకు తెలియదు. ఆ సమయంలో నా కుటుంబం, నా స్నేహితులు నాకు అండగా ఉన్నారు. నా చుట్టూ ఉన్న విషయాలను చాలా తేలిక చేశారు.’ అని రోహిత్ శర్మ అన్నాడు. ఇక ఓటమిని అంత త్వరగా మరిచిపోలేమని, అయితే ఇది జీవితం కనుక ముందుకు సాగక తప్పదన్నాడు.
వన్డే ప్రపంచకప్ చూస్తూ పెరిగాను..
‘చిన్నప్పటి నుంచి నేను వన్డే ప్రపంచకప్ చూస్తూ పెరిగాను. నాకు అదే గొప్ప బహుమతి. వన్డే ప్రపంచకప్ సాధించాలని ఎంతో కష్టపడ్డాము. మేము చేయాల్సిందంతా చేశాము. అయితే.. చివరికి నిరాశ తప్పలేదు. వరుసగా 10 మ్యాచులు గెలిచాము. ఆ మ్యాచుల్లో కూడా మేము కొన్ని తప్పులను చేశాము. ప్రతి మ్యాచులోనూ తప్పులు జరుగుతుంటాయి.’ అని హిట్మ్యాన్ అన్నాడు.
Rinku Singh : సిక్స్ కొట్టినందుకు క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్.. వీడియో వైరల్
ఇక జట్టు ప్రదర్శన పట్ల తాను గర్వపడుతున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. ‘మేము ఎలా ఆడాము అన్నది మీ అందరికి తెలుసు. ప్రతి ప్రపంచకప్లో ఇలాంటి ప్రదర్శన చేయలేమన్నారు. పైనల్ మ్యాచ్ తరువాత నేను ముందుకు వెళ్లాలని భావించాను. ఈ క్రమంలో నేను ఎక్కడికి వెళ్లినా నా మనస్సును కుదుటపరచాలని అనుకున్నాను. కాగా.. నేను ఎక్కడ ఉన్నా కూడా అక్కడకు అభిమానులు వచ్చి మీరు ఎంతో బాగా ఆడారని అభినందించారు. అయితే.. వాళ్లను చూసినప్పుడు మాత్రం నాకు బాధగా అనిపించింది.’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఎన్నో కలలు కన్నారు..
‘జట్టుగా మేమే కాదు.. అభిమానులు సైతం టీమ్ఇండియా ప్రపంచకప్ గెలవాలని ఎన్నో కలలు కన్నారు. వారు మాకెంతో మద్దతుగా నిలిచారు. వాళ్లను అభినందించాలని అనుకుంటున్నా. అయితే.. ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచించిన ప్రతీ సారి ఎంతో నిరాశ కలుగుతోంది.’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
BBL : ప్రమాదకరంగా మారిన పిచ్.. 6 ఓవర్ల తరువాత మ్యాచ్ రద్దు.. ఇదేం తొలిసారి కాదు..
ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా వరుసగా 10 మ్యాచుల్లో విజయం సాధించింది. అయితే.. ఆఖరి మ్యాచులో ఆసీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఒక్క మ్యాచ్ను మినహాయిస్తే టీమ్ఇండియా ప్రదర్శన ఎంతో అద్భుతమనే చెప్పాలి.
View this post on Instagram