ODI World Cup 2023 : గంభీర్ కామెంట్స్.. రోహిత్ అలాంటి వాడే.. పీఆర్ టీమ్లు వ్యక్తిగత ప్రదర్శన చేయవు
ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ అటు బ్యాటింగ్తో ఇటు కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Published On : October 30, 2023 / 04:03 PM IST
Gautam Gambhir-Rohit Sharma
ODI World Cup : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయాలు సాధించింది. ఈ మెగా టోర్నీలో ఓటమే ఎగురని జట్టుగా కొనసాగుతోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఫామ్లో ఉండడంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే టీమ్ఇండియా వాటిని అధిగమించి విజయాలు సాధిస్తూ దాదాపుగా సెమీస్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ అటు బ్యాటింగ్తో ఇటు కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తెలిపాడు.
ఓ కెప్టెన్.. తన జట్టు నుంచి ఏం ఆశిస్తాడో.. ముందుగా తాను కూడా అలాంటి ప్రదర్శననే ఇవ్వాల్సి ఉంటుందని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్తో మ్యాచ్ లో రోహిత్ శర్మ అదే పనిని చేశాడు. అతడి ప్రదర్శన తనకు ఎంతో సంతృప్తి ఇచ్చింది అని అన్నాడు. ‘కెప్టెన్గా జట్టులోని ఇతర ప్లేయర్ల నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తామో.. కెప్టెన్ కూడా వ్యక్తిగతంగా అదే ఆటతీరును ప్రదర్శించాలి. అప్పుడే జట్టును మరింత ఆత్మవిశ్వాసంతో ముందుండి నడిపించవచ్చు. ఇందుకోసం పీఆర్ టీమ్లు, మార్కెటింగ్ ఏజెన్సీలు అవసరం లేదు. వ్యక్తిగత ప్రదర్శనను వారేమి చేయరు.’ అని గంభీర్ అన్నాడు.
Ratan Tata : క్రికెటర్ రషీద్ఖాన్కు 10 కోట్ల రివార్డు.. వాస్తవాలు వెల్లడించిన రతన్ టాటా
రోహిత్ అలాంటి వాడే..
ఇక ఇంగ్లాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ అలాంటి ప్రదర్శననే చేశాడని చెప్పాడు. మొదట జట్టుకు అవసరం అయిన సమయంలో సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో నిలబడి పరుగులు సాధించాడు. అతడు చేసింది 87 పరుగులే అయినా కూడా అది సెంచరీతో సమానం. అనంతరం బౌలర్లను అతడు వినియోగించుకున్న తీరు అమోఘమన్నాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ స్థానం ఆరు లేదా పది లేదంటే ఇంకా ఎక్కువ.. ఏమైనా ఉండొచ్చు. కానీ ప్రధాన లక్ష్యం మాత్రం నవంబర్ 19న వన్డే ప్రపంచకప్ను అందుకోవడమే అయి ఉండాలన్నాడు.
ఒకవేళ మీ లక్ష్యం సెంచరీలు చేయడమా..? లక్ష్యం ఏంటి అన్నది మీరే నిర్ణయం తీసుకోవాలి. సెంచరీలు చేయడమే అయితే.. అందుకోసమే ఆడు. అలా కాకుండా కప్పును ముద్దాడాలనే లక్ష్యమే అయితే మాత్రం రోహిత్ శర్మ లాగా ఆడుతారు. రోహిత్ నిస్వార్థంగా జట్టు కోసం ఆడుతున్నాడు. అతడి నుంచి ఇంకా ఆశిస్తున్నాను. అతడు ఖచ్చితంగా సాధిస్తాడనే నమ్మకం తనకు ఉందని గంభీర్ తెలిపాడు.
