harbhajan singh
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్ వేళ భారత మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో తలపడుతుండడంతో ఆసీస్ బ్యాటర్లను ఎలా కట్టడి చేయాలో చెప్పారు. భారత బౌలర్ మహమ్మద్ షమీకి హర్భజన్ సింగ్ పలు సూచనలు చేశాడు.
ముందుగా ట్రావిస్ హెడ్ మీద ఉన్న భయాన్ని మనసులోంచి తీసేయాలని చెప్పారు. ట్రావిస్ హెడ్ను కట్టడి చేయాలని, వీలైనంత తొందరగా ఔట్ చేయాలని అన్నారు. ఆసీస్ జట్టులో మ్యాక్స్వెల్, జోష్ వంటి గొప్ప బ్యాటర్లు ఉన్నారని చెప్పారు.
వారు భారీ షాట్లతో వేగంగా రన్స్ తీస్తారని తెలిపారు. అటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకూడదని తెలిపారు. ఆడుతున్నది నాకౌట్ మ్యాచ్ కాబట్టి అతిగా ఏ విషయమూ ప్రయత్నించాల్సిన అవసరం లేదని అన్నారు. మహమ్మద్ షమీ ఇప్పటివరకు ఆడిన విధానాన్నే కొనసాగించాలని తెలిపారు.
కాగా, న్యూజిలాండ్తో మ్యాచ్ గెలిచి గ్రూప్ దశలో సత్తా చాటిన టీమిండియా సెమీఫైనల్లో పూర్తి విశ్వాసంతో అడుగుపెట్టింది. సెమీఫైనల్లోనూ టీమిండియా అదే ఆటతీరును ప్రదర్శించి ఫైనల్లోకి అడుగుపెడుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడుతున్నాం కాబట్టి గత వన్డే ప్రపంచ కప్ను కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం అటువంటి అవకాశం ఇవ్వకూడదని ఫ్యాన్స్ అంటున్నారు. దుబాయ్లో భారత్, ఆసీస్ మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ప్రసారం చేస్తున్నాయి. దుబాయ్లో గేమ్ ప్రతిసారీ భిన్నమైన చాలెంజ్లను విసురుతోందని తాజాగా రోహిత్ శర్మ అన్నాడు. తాము ఆడిన మూడు మ్యాచుల్లోనూ విభిన్న విధంగా అనుభవాలను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. దుబాయ్ అంటే భారత్ సొంతగడ్డ కాదని గుర్తుచేశాడు. టీమిండియా ఇక్కడ అధికంగా మ్యాచులను ఆడలేదని అన్నాడు.