IND vs WI 2nd ODI: రెండో వన్డేలో టీమిండియా ఓటమి.. కుందేలు – తాబేలు కథ చెప్పిన హార్దిక్ పాండ్య
వన్డే ప్రపంచ కప్ నాటికి బలమైన జట్టుగా భారత్ సిద్ధం కావాలంటే బౌలింగ్లో ఇంకా శ్రమించాల్సి ఉంది. అంటే.. కుందేలు మాదిరిగా కాకుండా ..
- Harishth Thanniru
- Published On : July 30, 2023 / 09:42 AM IST
Captain Hardik Pandya
Captain Hardik Pandya: వెస్టెండీస్ జట్టు (West Indies team) టీమిండియా (Team India) కు గట్టి షాకిచ్చింది. మూడు వన్డేల సిరీస్ (ODI series) లో భాగంగా రెండో వన్డే శనివారం రాత్రి కెన్సింగటన్ ఓవల్ స్టేడియం (Kensington Oval Stadium) లో జరిగింది. తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టును మట్టికరిపించిన భారత్ జట్టు.. రెండో వన్డేలో బోల్తాపడింది. విండీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత్ ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55), శుభ్మన్ గిల్ (34) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేక పోయారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించి కరీబియన్ జట్టు కేవలం 182 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో వన్డేలో భారత్ బ్యాటర్లు, బౌలర్లు విఫలం అయ్యారు. ఈ క్రమంలో భారత్ ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించారు. కుందేలు – తాబేలు కథను గుర్తుచేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రెండో వన్డేలో ఓటమిపై హార్దిక్ మాట్లాడుతూ.. వెస్టిండీస్ జట్టుపై ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ లో మేం అనుకున్న విధంగా రాణించలేక పోయాం. సరియైన ప్రదర్శన ఇవ్వలేకపోవటం నిరుత్సాహానికి గురిచేసింది. ఈ మ్యాచ్ లో తప్పులను గుర్తించి మరోసారి పునరావృతంకాకుండా చూసుకోవాలి. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ మిగిలిన బ్యాటర్లం దానిని సద్వినియోగం చేసుకోలేక పోయామని హార్దిక్ చెప్పాడు.
IND vs WI 2nd ODI : భారత్ 181 ఆలౌట్.. Updates In Telugu
నేను మరిన్ని ఓవర్లు వేయాల్సి ఉంది. వన్డే ప్రపంచ కప్ నాటికి బలమైన జట్టుగా భారత్ సిద్ధం కావాలంటే బౌలింగ్లో ఇంకా శ్రమించాల్సి ఉంది. అంటే.. కుందేలు మాదిరిగా కాకుండా తాబేలులా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నిలకడగా రాణించాలి. అలా జరిగినప్పుడు వన్డే ప్రపంచ కప్ నాటికి టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడగా రాణించగలుగుతుంది అని హార్దిక్ పాండ్య చెప్పారు. రెండో వన్డేలో భారత్ జట్టు ఓటమితో మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు 1-1 పాయింట్లతో సమఉజ్జీలుగా ఉన్నాయి. దీనిపై హార్దిక్ స్పందిస్తూ.. మూడో వన్డే ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నాను అని చెప్పారు.
