Hardik Pandya Viral Post On Difficult Journey Ahead Of Sri Lanka Tour
Hardik Pandya – Suryakumar Yadav : ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య లంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా కెప్టెన్గా ఎవరు ఉంటారా? అన్న ఆసక్తి అందరిలో ఉంది. రోహిత్ గైర్హజరీలో పలు సిరీస్లకు హార్దిక్ పాండ్యా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది హార్దిక్ పాండ్యాకే టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారని అనుకుంటుండగా.. కాదు సూర్యకుమార్ యాదవ్ లంకతో పర్యటనకు కెప్టెన్గా ఎంపిక కానున్నాడే వార్తలు వస్తున్నాయి.
కేవలం లంకతో పర్యటనకు మాత్రమే కాదని, టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్గా ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లుగా పలు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంక పర్యటనతో టీమ్ఇండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్ గంభీర్ సైతం సూర్యకుమార్ కే ఓటు వేసినట్లుగా తెలుస్తోంది.
Unluckiest Dismissal : క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి ఔట్ను చూసి ఉండరు.. వీడియో వైరల్..
ఈ సమయంలో సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కఠోర శ్రమ ఎప్పటికీ వృథా కాదు అంటూ పేర్కొన్నాడు. ‘2023లో వన్డే ప్రపంచకప్ లో గాయపడడం తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే.. టీ20 ప్రపంచకప్లో విజయం సాధించడంతో ఇప్పటి వరకు పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నా. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది. గత కొన్ని రోజులుగా చేసిన కృషికి ఇంతకంటే అద్భుతమైన ముగింపు మరొకటి ఉండదు. శ్రమ ఎప్పటికీ వృథా కాదు. తప్పకుండా గుర్తింపు ఉంటుంది. అత్యుత్తమ ఫిట్నెస్ను సాధించేందుకు నిరంతరం కష్టపడుతూనే ఉందాం.’ అని హార్దిక్ పాండ్యా రాసుకొచ్చాడు.
2023 వన్డే ప్రపంచకప్ సమయంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. దీంతో ఆ టోర్నీకి దూరం అయ్యాడు. శస్త్ర చికిత్స అనంతరం ఆటకు కొన్ని నెలలు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలను చేపట్టాడు. కాగా..ముంబై అభిమానులే అతడిని ఎగతాళి చేసినట్లుగా ప్రవర్తించారు. అయితే.. పాండ్యా టీ20 ప్రపంచకప్ను భారత జట్టు నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో విమర్శలు చేసిన వారే ప్రశంసల వర్షం కురిపించారు. టీ20 ప్రపంచకప్లో 6 ఇన్నింగ్స్ల్లో 144 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు.