IND W : దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్కు చేరాలంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ (IND W) తొలి పరాజయాన్ని చవిచూసింది
- Thota Vamshi Kumar
- Published On : October 10, 2025 / 11:58 AM IST
How Team India Can Qualify For Womens World Cup Semifinals after lost to SA
IND W : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ తొలి పరాజయాన్ని చవిచూసింది. విశాఖ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని భావించిన భారత్ (IND W)కు ఈ ఓటమితో షాక్ తగిలింది. ప్రస్తుతానికి మూడో స్థానంలోనే భారత్ కొనసాగుతోంది. మరోవైపు ఈ మ్యాచ్కు ముందు ఐదో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా.. భారత్ పై విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకింది.
భారత్ సెమీఫైనల్కు చేరుకోవాలంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లోని నిబంధనల ప్రకారం గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లు ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానాల్లో ఉన్న జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఇక భారత జట్టు గ్రూప్ స్టేజీలో మరో నాలుగు మ్యాచ్లు ఆడనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో తలపడనుంది. ఈ నాలుగు మ్యాచ్ల్లో భారత్ కనీసం మూడు మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే సెమీస్లో అడుగుపెడుతుంది.
రెండు మ్యాచ్ల్లో ఓడితే మాత్రం అప్పుడు టీమ్ఇండియా సెమీస్ సమీకరణాలు సంక్లిష్టం అవుతాయి. అప్పుడు మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారాపడాల్సి ఉంటుంది. అదే సమయంలో నెట్రన్రేటు సైతం కీలకం అవుతుంది.
మూడు మ్యాచ్ల్లో ఓడితే..?
ఇక పై టీమ్ఇండియా ఆడనున్న నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్ల్లో భారత్ ఓడిపోతే.. అప్పుడు సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతు అవుతాయి. అప్పుడు టోర్నీ నుంచి భారత్ నిష్ర్కమిస్తుంది. కాగా.. భారత్ ఆడనున్న నాలుగు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచ్లు చాలా కఠినమైనవే.
ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్లో భారత్ గెలిస్తే మాత్రం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే అప్పుడు కష్టాలు తప్పకపోవచ్చు.
ఇప్పటి వరకు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేదు. వీరు ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాపార్డర్లో ఒకరు భారీ ఇన్నింగ్స్ లు ఆడితే భారీ స్కోర్లు చేయడం భారత్కు పెద్ద కష్టం కాదు.
