Shakib Al Hasan : భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్కు తిరిగి వస్తా.. షకీబ్ అల్ హసన్ కామెంట్స్..
బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- August 8, 2026 / 02:55 PM IST
I will return to Bangladesh if security is provided Shakib Al Hasan
Shakib Al Hasan : బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. అయితే తన భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరాడు. భద్రత కల్పిస్తే దేశానికి వచ్చి తనపై ఉన్న కేసులను ఎదుర్కొంటానని, కోర్టు విచారణకు కూడా హాజరవుతానని షకీబ్ స్పష్టం చేశాడు.
మాజీ బంగ్లాదేశ్ కెప్టెన్ అయిన షకీబ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తరఫున ఎంపీగా కూడా పనిచేశాడు. విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనల కారణంగా 2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో అతడి పదవి కూడా పోయింది. అంతే కాకుండా అతడి క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అప్పటి నుంచి అతడు అమెరికాలో ఉంటున్నాడు.
ప్రస్తుతం 39 ఏళ్ల షకీబ్ అంతర్జాతీయ క్రికెట్కు ఇంకా దూరం కాలేదు. స్వదేశంలో వీడ్కోలు సిరీస్ ఆడాలని, 2027 వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్కు ప్రాతినిధ్యం వహించాలని అతడు కోరుకుంటున్నాడు.
‘ప్రభుత్వం నా భద్రతకు హామీ ఇస్తే బంగ్లాదేశ్కు వెళ్లి కోర్టు విచారణతో పాటు అవసరమైన అన్ని ప్రక్రియలను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు.’ అని షకీబ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇటీవల షేక్ హసినీ నిర్వహించిన ప్రెస్ కాన్షరెన్స్లో షకీబ్ వర్చువల్గా పాల్గొన్నాడు. దీంతో బంగ్లాదేశ్లోని అతడి ఇంటిపై దుండగలు పెట్రోల్ బాంబులు విసిరి భీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో అతడు బంగ్లాకు తిరిగి వస్తానని చెప్పడం గమనార్హం.
ఇక తన పై ప్రస్తుతం రెండు కేసులు ఉన్నాయన్నాడు. అందులో ఒకటి అవినీతి దర్యాప్తు కాగా, మరొకటి 2024 ఆగస్టు నిరసనల్లో ఓ వ్యక్తి మరణానికి సంబంధించిన హత్య కేసుగా తెలిపాడు. తాను టొరంటోలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే ఈ హత్య కేసు నమోదైందని షకీబ్ పేర్కొన్నాడు. దర్యాప్తుల నేపథ్యంలో తన బ్యాంకు ఖాతాలను 18 నెలలుగా నిలిపివేశారని షకీబ్ తెలిపాడు. గత పదేళ్లుగా అత్యధిక పన్నులు చెల్లించిన ఆటగాళ్లలో తాను ఉన్నానని, అవసరమైన అన్ని వివరాలను అధికారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
స్వదేశంలో వీడ్కోలు మ్యాచ్ ఆడాలని..
స్వదేశంలో బంగ్లాదేశ్ తరుపున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలని ఉందని షకీబ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను ఫ్రాంఛైజీ లీగ్లలో ఆడుతూ ఆటను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే.. వయసు పెరుగుతున్న కొద్ది ఆటలో కొనసాగేందుకు ఇబ్బందులు వస్తున్నాయన్నాడు. స్వదేశంలో అభిమానుల మధ్య చివరి మ్యాచ్ ఆడడంతో పాటు 2027 వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్ తరుపున ఆడాలన్నదే తన కోరిక అని షకీబ్ చెప్పాడు.
