yashasvi jaiswal
yashasvi jaiswal: ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమైంది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేయగా.. భారత్ ఆటగాళ్లు అదరగొట్టారు. యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ సెంచరీలతో ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొట్టుడు కొట్టారు. ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో యశస్వీ జైస్వాల్ (101; 159 బంతుల్లో 16×4, 1×6) సెంచరీ చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ ఇప్పటివరకు ఇంగ్లాండ్తో ఆడిన 10 ఇన్నింగ్స్ లలో 90.33 సగటుతో 813 పరుగులు చేశాడు. దీంతో జైస్వాల్ డాన్ బ్రాడ్మన్ను ఇంగ్లాండ్పై యావరేజ్ విషయంలో (మినిమం 500 పరుగులు) అధిగమించాడు. బ్రాడ్మాన్ ఇంగ్లాండ్ జట్టుపై 63 ఇన్నింగ్స్ లలో 89.78 సగటుతో 5,028 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టుపై 90ప్లస్ యావరేజ్ కలిగిఉన్న ఏకైక బ్యాటర్ గా యశస్వీ జైస్వాల్ నలిచాడు.
ఇంగ్లాండ్పై అత్యధిక టెస్ట్ సగటు సాధించిన బ్యాటర్లు వీరే..
♦ యశస్వి జైస్వాల్ -90.33
♦ డాన్ బ్రాడ్మాన్ – 89.78
♦ స్టీవీ డెంప్స్టర్ – 88.42
♦ లారెన్స్ రోవ్ – 74.20
♦ జార్జ్ హెడ్లీ – 71.23
మరోవైపు.. ఇంగ్లాండ్లో తన తొలి టెస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించాడు. 2024/25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పెర్త్లో జరిగిన ఆస్ట్రేలియాలో తన తొలి టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్లో కూడా అతను 161 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై తన తొలి టెస్ట్ మ్యాచ్లలో సెంచరీ సాధించిన మొదటి భారతీయ బ్యాట్స్మన్గా జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్లో తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించిన ఐదవ భారతీయ బ్యాటర్గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.
ఇంగ్లాండ్లో తమ తొలి టెస్ట్లో సెంచరీ సాధించిన భారతీయ ప్లేయర్లు ..
♦ మురళీ విజయ్ – 2014 (146 పరుగులు)
♦ విజయ్ మంజ్రేకర్ – 1952(133 పరుగులు)
♦ సౌరవ్ గంగూలీ – 1996 (131 పరుగులు)
♦ సందీప్ పాటిల్ – 1982 (129 నాటౌట్)
♦ యశస్వీ జైస్వాల్ – 2025 (101 పరుగులు)