IND vs ENG 3rd T20 : పూర్తి ఫిట్గా మహ్మద్ షమీ.. అయినా సరే మూడో టీ20లో నో ఛాన్స్! ఆ ఇద్దరి చేతుల్లోనే సీనియర్ పేసర్ భవితవ్యం
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఈ విషయాన్ని భారత నయా బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు.
- Thota Vamshi Kumar
- Published On : January 28, 2025 / 11:36 AM IST
India new batting coach confirms Mohammed Shami fit Ahead of 3rd T20 match against India
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం కోసం వేచి చూస్తున్నాడు. గాయం కారణంగా గత 14 నెలలుగా ఆటకు దూరం అయ్యాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసినప్పటికి తొలి రెండు టీ20ల్లో అతడు ఆడలేదు. అదే సమయంలో అతడు మోకాలికి పట్టీ వేసుకుని ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోసారి షమీ గాయపడినట్లుగా వార్తలు వస్తుండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై టీమ్ఇండియా నూతన బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. అవన్నీ రూమర్లేనని, షమీ పూర్తి ఫిట్ గా ఉన్నాడన్నారు.
మూడో టీ20కి ముందు మీడియాతో సితాన్షు కోటక్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. షమీ మిగిలిన టీ20ల్లో ఆడాలా వద్దా అనే విషయం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లు నిర్ణయిస్తారని చెప్పాడు. ‘అవును షమీ ఫిట్గా ఉన్నాడు, కానీ అతను ఆడటం లేదా ఆడకపోవడం గురించి ఏదో నేను చెప్పలేను. ఎందుకంటే ఆ విషయాన్ని ప్రధాన కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లు నిర్ణయిస్తారు.’ అని కోటక్ అన్నారు.
చివరిసారిగా షమీ భారత్ తరుపున వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడాడు. చీలమండల గాయానికి గురి కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకోవడంతో ఇటీవలే దేశవాళీ టోర్నీల్లో పశ్చిమబెంగాల్ తరుపున ఆడాడు. వాస్తవానికి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కే షమీ రీ ఎంట్రీ ఇస్తాడని వార్తలు రాగా.. టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ షమీ మోకాలిపై స్వల్ప వాపు వచ్చిందని, అతడి విషయంలో తాము తొందర పడడం లేదన్నాడు.
ఈ క్రమంలో పూర్తి ఫిట్నెస్ సాధించిన షమీ ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపిక అయ్యాడు. అయినా కూడా అతడికి ఆడే అవకాశం రాలేదు. ఈ విషయం గురించి తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని తాము భావించామని అందుకనే షమీ అవకాశం దక్కలేదన్నాడు. ఇక రెండో టీ20 మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన చెన్నై పిచ్ కూడా స్పిన్కే సహకరించడంతో షమీకి మరోసారి మొండిచేయి ఎదురైంది.
కనీసం మంగళవారం రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టీ20 మ్యాచ్లోనైనా షమీ ఆడిస్తారా? లేదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే.. అందుతున్న ప్రకారం షమీ ఈ మ్యాచ్లోనూ ఆడడం కష్టమేనట. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా సిరీస్ మొత్తానికే దూరం కావడంతో అతడి స్థానంలో శివమ్ దూబెకు తుది జట్టులో స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది.
