×
Ad

IND vs NZ : మేం కావాలనే అలా చేశాం.. ఇంకొక్కడు ఆడినా పరిస్థితి వేరేలా ఉండేది.. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

IND vs NZ : మ్యాచ్ సమయంలో మంచు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకటి, రెండు భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే బాగుండేది. శివమ్ దూబే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి తోడుగా ఇంకొక్క బ్యాటర్ పరుగులు రాబట్టినా భారత్ జట్టు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉండేవి అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.

Suryakumar Yadav

  • నాల్గో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి
  • 50 పరుగుల తేడాతో విజయం సాధించిన కివీస్
  • ఓటమికి కారణాలను వెల్లడించిన సూర్యకుమార్ యాదవ్

IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నాల్గో మ్యాచ్ బుధవారం రాత్రి వైజాగ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్లు డెవన్ కాన్వే (44), టీమ్ సీఫెర్ట్ (62) రాణించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలను వెల్లడించారు.

Also Read  : T20 Rankings : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు.. ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆట‌గాళ్ల దూకుడు

సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మేం కావాలనే ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాం. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలనుకున్నాం. అదే సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవాలని అనుకున్నాం. 180 నుంచి 200 పరుగుల లక్ష్య చేధనలో ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. ఈ మ్యాచ్ లో ఓడినా ఇది మాకు ఓ గుణపాఠం. ప్రపంచ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే ఇతర ఆటగాళ్లను ఆడించలేదు’’ అని సూర్య చెప్పారు.

మ్యాచ్ సమయంలో మంచు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకటి, రెండు భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే బాగుండేది. శివమ్ దూబే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి తోడుగా ఇంకొక్క బ్యాటర్ పరుగులు రాబట్టినా భారత్ జట్టు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉండేవి అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.


ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా క్యాచ్ మిస్ చేయడం వల్లనే న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ చేయగలిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే న్యూజిలాండ్ ఓపెనర్ టీమ్ సీఫఎర్ట్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ ను బుమ్రా వదిలేయడం టీమిండియా ఓటమికి కారణాల్లో ఒకటని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో టీమ్ సీఫెర్ట్ భారీ షాట్ ఆడగా.. షార్ట్ థర్డ్ లో ఫీల్డింగ్ చేసిన బుమ్రా వెనక్కి పరుగెత్తి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ, బంతిని అందుకోలేక పోయాడు. ఆ తరువాత టీమ్ సీఫెర్ట్ ఆకాశమేహద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 36 బంతుల్లోనే 62 పరుగులు చేసి కివీస్ విజయంలో కీలక భూమిక పోషించాడు.