Ind Vs NZ: న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
- Naveen
- Published On : January 31, 2026 / 10:32 PM IST
Pic Courtesy EspnCricinfo, @BCCI
- చివరి టీ20లో భారత్ విక్టరీ
- సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్
- కివీస్ ను కట్టడి చేసిన బౌలర్లు
Ind Vs NZ: తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 46 రన్స్ తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 225 రన్స్ కే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ బ్యాటర్ ఫిన్ అలెన్ కాసేపు భారత్ ను భయపెట్టాడు. అయితే, భారత బౌలర్లు పుంజుకోవడంతో వరుసగా వికెట్లు పడ్డాయి.
ఫిన్ అలెన్ 38 బంతుల్లోనే 80 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. 5 మ్యాచుల టీ20 సిరీస్ ను 4-1 తేడా భారత్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. పరుగుల వరద పారించాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో ఇషాన్ కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నారు. 10 సిక్సర్లు, 6 ఫోర్లతో కివీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. మరోవైపు సూర్య మెరుపు బ్యాటింగ్ చేశాడు. 30 బంతుల్లోనే 63 పరుగులు చేసి ఔటయ్యాడు.
