Women’s IPL: త్వరలో మహిళల ఐపీఎల్.. అంగీకరించిన బీసీసీఐ.. వచ్చే మార్చి నుంచే ప్రారంభం
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి తాజాగా బీసీసీఐ అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
- Narender Thiru
- Published On : October 18, 2022 / 06:31 PM IST
Women’s IPL: త్వరలో మహిళల ఐపీఎల్ జరగబోతుంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రతిపాదనకు బీసీసీఐ తాజాగా అంగీకారం తెలిపింది. మంగళవారం ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎమ్)లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.
మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం జరిగిన సమావేశంలో మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సౌరవ్ గంగూలీ స్థానలో రోజర్ బిన్నీ బాధ్యతలు స్వీకరిస్తారు. మహిళల ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఐదు జట్లు మహిళల ఐపీఎల్లో పాల్గొనే అవకాశం ఉంది. త్వరలోనే టీమ్లు, జట్టు కూర్పు వంటి ప్రక్రియ జరగనుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ ఐపీఎల్ నిర్వహిస్తారు.
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ 2022 మహిళల టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ప్రతి జట్టులో 18 మంది ఆటగాళ్లు ఉంటారు. వీరిలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. ఇక తుది జట్టులో ఉండే 11 మంది ఆటగాళ్లలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. రాబోయే మొదటి సీజన్లో 22 మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
