Hardik Pandya-Rohit Sharma
Asia Cup 2023 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్(Asia Cup) మరో 9 రోజుల్లో ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనున్న జట్లు అన్ని దాదాపుగా తమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. ఇక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) కూడా భారత జట్టును సోమవారం (ఆగస్టు 21) ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఢిల్లీలో సోమవారం సమావేశమై జట్టును ఎంపిక చేయనుంది. దాదాపుగా ఇదే జట్టు వన్డే ప్రపంచకప్ ఆడనున్న నేపథ్యంలో జట్టు ఎంపిక కీలకం కానుంది. ఈ సమావేశంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ లు కూడా పాల్గొనున్నట్లు సమాచారం.
సాధారణంగా ఏ ద్వైపాక్షిక సిరీస్లకైనా లేదంటే మెగా టోర్నీలకు అయినా సరే 15 మందితో కూడిన జాబితాను సిద్ధం చేస్తారు. అయితే.. ఆసియా కప్ కు మాత్రం 17 మందితో కూడిన జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఇవ్వనుండగా శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రానట్లు తెలుస్తోంది. అయ్యర్ ఇంకా పూర్తి మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. దీంతో అతడి విషయంలో సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
మరో వైపు భారత జట్టు వైస్ కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేస్తారు అనే చర్చ నడుస్తోంది. వన్డేల్లో ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై వేటు పడనుందని, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు ఆ బాధ్యతలు అప్పగించనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. “కెప్టెన్సీ విషయంలో సీనియారిటీ పరంగా చూస్తే పాండ్య కంటే బుమ్రానే ముందు ఉన్నాడు. 2022లోనే అతడు టెస్టు జట్టుకు నాయకత్వం వహించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ కారణంతోనే అతడు ఆసియా కప్కు వైస్ కెప్టెన్గా ఎంపికైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.” అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
Mohammad Naim : నిప్పుల పై నడిచిన క్రికెటర్.. దేని కోసమో తెలుసా..?
వెన్నునొప్పి కారణంగా చాలా కాలం ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఇటీవలే ఐర్లాండ్ పర్యటనతో రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రావడంతోనే అతడికే జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. తొలి టీ20 మ్యాచ్లో మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు బుమ్రా. ఇక వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బుమ్రా గెలుచుకున్నాడు.
IND vs IRE : చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. విరాట్, రోహిత్, ధోని వల్ల కాలేదు