KL Rahul : టాస్ గెలవడం తప్ప నేను చేసిందేమీ లేదు.. కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్..
సిరీస్ను కైవసం చేసుకోవడం పట్ల కేఎల్ రాహుల్ (KL Rahul ) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : December 7, 2025 / 10:57 AM IST
KL Rahul comments after India win the ODI series Against South africa
KL Rahul : విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కావడంతో ఈ సిరీస్ వరకు తాత్కాలిక సారథిగా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు.
సిరీస్ను కైవసం చేసుకోవడం పట్ల కేఎల్ రాహుల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వరుసగా 20 వన్డే మ్యాచ్ల్లో భారత జట్టు టాస్ ఓడిపోగా.. విశాఖలో టాస్ గెలవడం పై కూడా రాహుల్ మాట్లాడాడు. టాస్ గెలవడం చాలా కీలకమన్నాడు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించడంలో టాస్ గెలడం తప్ప తన పాత్ర ఏమీ లేదన్నాడు. ఇక ఈ సిరీస్లో తాను గర్వపడిన సందర్భం కూడా టాస్ గెలిచినప్పుడే అని చెప్పుకొచ్చాడు.
Rohit Sharma : కేక్ తినేందుకు నిరాకరించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక మాట చెప్పాడు చూడు..
ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో టీమ్ఇండియా టాస్ ఓడిపోవడం వల్లే బౌలింగ్ చేయాల్సి వచ్చిందన్నాడు. డ్యూ ఫ్యాక్టర్ కారణంగా బౌలర్లకు బంతి పై పట్టు దొరకలేదన్నాడు. ఇక విశాఖలో టాస్ గెలవడంతో బౌలర్లు బతికిపోయారన్నాడు. ఇక పిచ్ గురించి మాట్లాడుతూ.. ఈ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం అని చెప్పుకొచ్చాడు. అయినప్పటికి కూడా తమ బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి ప్రత్యర్థిని కట్టడి చేశారన్నాడు.
మొదటగా ప్రసిద్ద్ ఇబ్బంది పడినప్పటికి ఆ తరువాతి స్పెల్తో మ్యాచ్ను గతిని మార్చివేశాడన్నాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం చాలా చక్కగా బంతులు వేశాడని తెలిపాడు. వన్డే క్రికెట్లో మ్యాచ్లు గెలవాలంటే ఏకైక మార్గం వికెట్లు తీయడమేనని అన్నాడు.
క్వింటన్ డికాక్ జోరు మీదుండడంతో దక్షిణాఫ్రికా ఈజీగా 350 పరుగులు చేస్తుందని భావించామని, అయితే.. అతడి వికెట్ తీయడం కలిసి వచ్చిందన్నాడు. ఇక సిరీస్ గెలవడంతో ఎంతో సంతోషంగా ఉందన్నాడు.
