India A vs Australia A : 1, 1, 1,11.. ఇవీ ర్యాంకులు కాదండోయ్.. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్ల స్కోర్లు.. ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్, నితీశ్ రెడ్డి, జురెల్..
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్లో (India A vs Australia A ) కేఎల్ రాహుల్, దేవ్దత్ పడిక్కల్, నితీశ్కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్లు ఘోరంగా విఫలం అయ్యారు.
- Thota Vamshi Kumar
- Published On : September 24, 2025 / 02:14 PM IST
KL Rahul Nitish Kumar Reddy Dhruv Jurel fail against Australia A in 2nd Unofficial Test
India A vs Australia A : ఆసియాకప్ 2025 అనంతరం భారత జట్టు వెస్టిండీస్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో పాల్గొనే భారత ఆటగాళ్లను ఒకటి లేదా రెండు రోజుల్లో సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు.
సరిగ్గా ఈ సమయంలోనే టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, దేవ్దత్ పడిక్కల్, నితీశ్కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్లు ఘోరంగా విఫలం అయ్యారు. రాహుల్ మినహా మిగిలిన వారు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. ఇంకా చెప్పాలి అంటే ఈ ముగ్గురు తలా ఒక్కొక్క పరుగు మాత్రమే సాధించారు.
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ కీలక నిర్ణయం.. కొన్నాళ్లు రెడ్ బాల్ క్రికెట్కు దూరం..
ఆస్ట్రేలియా-ఏ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ క్రమంలో భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య మంగళవారం నుంచి రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్లో 97.2 ఓవర్లలో 420 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ బ్యాటర్లలో జాక్ ఎడ్వర్డ్స్ (88), టాడ్ మర్ఫీ(76), నాథన్ మెక్స్వీనీ(74) లు రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ ఐదు వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ కృష్ణ, సిరాజ్ లు ఒక్కొ వికెట్ సాధించారు.
ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఏకు ఆదిలోనే గట్టి షాక్లు తగిలింది. వెస్టిండీస్తో సిరీస్ నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం ఆడుతున్న కేఎల్ రాహుల్ 11 పరుగులు మాత్రమే చేసి విల్ సదర్లాండ్ బౌలింగ్లో వికెట్ కీపర్ జోష్ ఫిలిప్కు క్యాచ్ ఇచ్చిం పెవిలియన్కు చేరుకున్నాడు. మరో ఓపెనర్ ఎన్ జగదీషన్ (38) పరుగులతో పర్వాలేదనిపించాడు.
వెస్టిండీస్తో సిరీస్ కోసం జట్టులో చోటు కోసం చూస్తున్న దేవ్దత్ పడిక్కల్ (1), ధ్రువ్ జురెల్ (1), నితీశ్ రెడ్డి (1)లు ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో భారత్ 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (23 నాటౌట్), ఆయుష్ బదోని (12 నాటౌట్) లు వేసుకున్నారు. ప్రస్తుతం 30 ఓవర్లకు భారత్-ఏ తొలి ఇన్నింగ్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 108 పరుగులుగా ఉంది. ఆసీస్-ఏ స్కోరుకు భారత్-ఏ ఇంకా 312 పరుగుల దూరంలో ఉంది.
