Mary Kom : ఒలింపిక్స్ బాధ్యతల నుంచి తప్పుకున్న మేరీకోమ్.. మరో అవకాశం లేదు..
దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : April 12, 2024 / 06:59 PM IST
Mary Kom steps down as Paris Olympics Chef de Mission personal reason
పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇది తప్ప తనకు మరో మార్గం లేదన్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ రాశారు.
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొననున్న భారత జట్టుకు మెంటార్గా సేవలు అందించేందుకు చెఫ్ డీ మిషన్గా మేరీ కోమ్ను నియమించినట్లు మార్చి 21న భారత ఒలింపిక్స్ అసోసియేషన్ తెలిపింది. అయితే.. ఉన్నట్లుండి మేరీకోమ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది.
‘దేశానికి సేవ చేయడం గొప్ప బాధ్యతగా బావిస్తాను. అందుకోసం ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యా. అయితే.. వ్యక్తిగత కారణాలతో ఈ బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నాను. అందుకనే ఈ పదవి నుంచి వైదొలుగుతున్నాను. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. ఇంతకు మించిన మార్గం వేరే కనబడడం లేదు. దేశం తరుపున ఒలింపిక్స్లో ఆడుతున్న ప్రతి అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటా..’ అని మేరీ కోమ్ లేఖలో తెలిపింది.
దీనిపై భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష స్పందించింది. ‘మేరీకోమ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడం బాధాకరం. అయినప్పటికీ, ఆమె నిర్ణయాన్ని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాల్సి అవసరం ఉంది. త్వరలోనే మేరీ కోమ్ స్థానంలో కొత్త వారిని నియమిస్తాం.’ అని పీటీ ఉష తెలిపింది.
